
నింగ్బో (చైనా): ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్లో ఇండియా షూటర్లకు తొలిరోజు నిరాశ ఎదురైంది. 10మీ ఎయిర్ పిస్టల్, ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో ఇండియా జట్లు ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయాయి. మంగళవారం (సెప్టెంబర్ 09) జరిగిన 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సురభి రావు, అమిత్ శర్మ జోడీ 594 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచింది.
మరో జంట రిథమ్ సంగ్వాన్– నిశాంత్ రావత్ 571 పాయింట్లతో 13వ స్థానంతో సరిపెట్టింది. 10మీ ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రమిత జిందాల్– మద్దిలనేని ఉమా మహేష్ జోడీ 628.6 పాయింట్లతో 14వ స్థానంతో సరిపెట్టింది. ఒలింపియన్ దివ్యాన్ష్ సింగ్ పన్వార్– మేఘన సజ్జనార్ ద్వయం 622.1 పాయింట్లతో 34వ స్థానానికి పరిమితమైంది.