ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ కు రెండేళ్లు పూర్తయ్యాయి. 2019లో సరిగ్గా ఇదే రోజున చైనాలోని వుహాన్ లో కరోనా వైరస్ పై అక్కడి లోకల్ అథారిటీ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచాన్ని ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో వణికించింది. ప్రపంచం మొత్తానికి తాళం పడేలా చేసింది. అగ్రరాజ్యాల నుంచి తిండి కూడా దొరకని పేద దేశాలను సైతం కరోనా అల్లాడించింది. ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది ఈ వైరస్. లక్షలాది మంది ప్రాణాలు తీసింది. వుహాన్ లోని ల్యాబ్ లోనే వైరస్ తయారయ్యిందనే ఆరోపణలు తప్ప.. ఇప్పటి వరకు కరోనా వైరస్ మూలం ఏంటనేది తేల్చలేకపోయారు సైంటిస్టులు. మూడో ఏడాదిలోకి అడుగుపెట్టినా.. వైరస్ ఉధృతి మాత్రం ఆగలేదు. క్రమంగా రూపం మార్చుకుంటూ ఇప్పటికీ ప్రజల ప్రాణాలు తీస్తూనే ఉంది. ఆల్ఫా ,బీటా, గామా వేరియంట్లు పెద్దగా ప్రభావం చూపకపోయినా.. ఆ తర్వాత వచ్చిన డెల్టా మాత్రం ప్రతాపం చూపించింది. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. రోజుల వ్యవధిలోనే కేసులు రెట్టింపవుతున్నాయి.
కరోనా వైరస్ కారణంగా రెండేళ్లలో 54 లక్షల 48 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారిక లెక్కల ప్రకారమే.. మొత్తం 28 కోట్ల 69 లక్షల 74వేల మందికి వైరస్ సోకింది. చాలా మంది హాస్పిటల్ లో చేరి ప్రాణాలు దక్కించుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 3 కోట్ల 48 లక్షల 38 వేలకు మందికి వైరస్ సోకింది. వీరిలో 4 లక్షల 81 వేలకు పైగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా అమెరికాలో 5 కోట్ల 52 లక్షల 52 వేల మంది కరోనా బారిన పడితే.. 8 లక్షల 45 వేలకు పైగా బాధితులు చనిపోయారు. ఒక దశలో శవాలను కాల్చేందుకు కూడా స్మశానాల్లో స్థలం దొరకని పరిస్థితి ఏర్పడింది. డెబ్ బాడీలను అంబులెన్సుల్లో పెట్టుకుని.. స్మశానవాటికల బయట రోజంతా వేచి చూడాల్సిన దయనీయ పరిస్థితులను చూడాల్సి వచ్చింది.
పోస్ట్ కొవిడ్ ప్రాబ్లమ్స్, కొమార్బిడిటీస్ తోను చాలామంది చనిపోయారు. కరోనా దెబ్బతో దేశంతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థలోని లోపాలు బయటపడ్డాయి. హాస్పిటల్ లో బెడ్స్, మెడిసిన్, ఆక్సీజన్ దొరక్క ఇబ్బందులు పడ్డారు. దీంతో ఫస్ట్ వేవ్ తర్వాత అన్ని దేశాలు అలర్ట్ అయ్యాయి. హాస్పిటల్స్ లో మౌలికవసతుల కల్పనపై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే రెండు వేవ్ లతో ప్రపంచమంతా వణికిపోయింది. ఇప్పుడు మూడో వేవ్ తో చాలా దేశాలు టెన్షన్ పడుతున్నాయి . దేశంలోనూ మూడో వేవ్ పరిస్థితులు మొదలవ్వడంతో కేంద్ర సర్కారు అలర్ట్ అయ్యింది. మళ్లీ ఆంక్షలు పెడుతున్నాయి దేశాలు. ఫస్ట్ వేవ్ టైంలో కనిపించిన ఆంక్షలు ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయి. ఎయిర్ పోర్టుల్లో టెస్టులు చేస్తున్నారు. అంతర్జాతయ ప్రయాణికులపై ప్రత్యేక ఆంక్షలు పెడుతున్నారు .