
- హైదరాబాద్లో సీడబ్ల్యూసీ మీటింగ్?
- 16న భేటీ.. 18న ఎన్నికలశంఖారావ సభ!
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. సీడబ్ల్యూసీ మీటింగ్ హైదరాబాద్లో నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి దాకా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ హైదరాబాద్లో జరగలేదు. ఈ నెల 16న సీడబ్ల్యూసీ మీటింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు కమిటీలోని సభ్యులంతా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. 18న హైదరాబాద్ వేదికగా ‘ఎన్నికల శంఖారావం’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీడబ్ల్యూసీ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, సీడబ్ల్యూసీ, బహిరంగ సభ తేదీలు మారే అవకాశం కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ అత్యవసర సమావేశాలు ఉండటంతో.. తేదీలు మారినా.. సీడబ్ల్యూసీ మీటింగ్ మాత్రం హైదరాబాద్లోనే నిర్వహించేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల కమిటీ భేటీ వాయిదా
పీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా పడింది. శనివారం జరగాల్సిన సమావేశాన్ని ఆదివారానికి పోస్ట్పోన్ చేశారు. శనివారం వైఎస్ వర్ధంతి ఉండటంతో సమావేశం వాయిదా వేయాలని పార్టీ నేతలు కోరారని, ఈ క్రమంలోనే వాయిదా వేశారని తెలిసింది. ఆదివారం జరిగే మీటింగ్లో మరోసారి అభ్యర్థులను వడపోయనున్నారు. సోమవారం స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. అభ్యర్థుల వివరాలపై ఎన్నికల కమిటీ నేతలతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ చర్చించనున్నారు.