
న్యూఢిల్లీ: పాపులర్ పారాసెట్మల్ బ్రాండ్ డోలో 650 ని తయారు చేస్తున్న ఫార్మా కంపెనీ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ ఆఫీసులపై ఐటీ దాడులు జరిగాయి. ట్యాక్స్ ఎగ్గొట్టారనే ఆరోపణలపై కంపెనీకి చెందిన బెంగళూరు ఆఫీస్లో సోదాలు నిర్వహించారు. మొత్తం 20 మంది అధికారులతో కూడిన ఓ ఐటీ టీమ్ ఈ దాడులు చేసింది. బెంగళూరు రేస్ కోర్స్ రోడ్డులోని ఆఫీస్లో దాడులు జరిపామని, ఇదే టైమ్లో దేశం మొత్తం మీద కంపెనీకి ఉన్న 40 లొకేషన్లలో కూడా దాడులు చేశామని ఓ ఐటీ అధికారి పేర్కొన్నారు. మొత్తం 200 మంది అధికారులతో ఢిల్లీ, సిక్కిం, పంజాబ్, తమిళనాడు, గోవా రాష్ట్రాల్లోని కంపెనీ ఆఫీసుల్లో, ఇతర ఏరియాల్లోని ఆఫీసుల్లో సోదాలు నిర్వహించామని వివరించారు. మైక్రో ల్యాబ్స్ చైర్మన్ అండ్ ఎండీ దిలీప్ సురానా, డైరెక్టర్ ఆనంద సురానా ఇండ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బెంగళూరు ఆఫీస్ నుంచి కీలకమైన డాక్యుమెంట్లను సేకరించారు.