
ఖైరతాబాద్, వెలుగు: నిమ్స్ హాస్పిటల్లో ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న తాము, ఈపీఎఫ్ తో నష్టపోతున్నామని.. దాన్ని నిమ్స్ పెన్షన్ కు కన్వర్ట్ చేయాలని స్టాఫ్ నర్సులు డిమాండ్ చేశారు. మంగళవారం లంచ్ అవర్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నిమ్స్ పారా మెడికల్ యూనియన్ ప్రెసిడెంట్ శాంతి మాట్లాడుతూ.. 1994లో పెన్షన్ స్కీమ్ ను అమలు చేశారని, అప్పుడు 800 మంది నిమ్స్ పెన్షన్ లోకి ఆప్షన్ పెట్టుకుని మారారన్నారు. 200 మంది ఈపీఎఫ్లోనే ఉండిపోయారని తెలిపారు.
2011లో మళ్లీ ఆప్షన్ ఓపెన్ చేసి సర్క్యులర్ ఇచ్చారని, అప్పుడు మిగిలిన 20శాతం మంది ఆప్షన్ ఇచ్చారన్నారు. 2011 నుంచి ఈపీఎఫ్ అనేది 5సార్లు ఎగ్జిక్యూటివ్ బోర్డ్ లో తీర్మానాన్ని అప్రూవల్ చేస్తూ, గవర్నింగ్ కౌన్సిల్ కు సబ్మిట్ పంపించాలన్నారు. 15ఏండ్లుగా గవర్నింగ్ కౌన్సిల్ జరగకపోవడంతో తమ ఫైల్ పెండింగ్ లో ఉందన్నారు. కొన్నిసార్లు నిమ్స్ మేనేజ్మెంట్ చర్చలకు పిలిచి.. పెన్షన్ స్కీం కుదరదని చెప్పిందని తెలిపారు. కార్యక్రమంలో పోదెటి చంద్ర శేఖర్, దేవదానం తదితరులు పాల్గొన్నారు.