
జగిత్యాల టౌన్, వెలుగు : కోర్టు తీర్పును అమలు చేయకపోవడంతో జగిత్యాల ఆర్డీవో ఆఫీస్ సామగ్రిని గురువారం జప్తు చేశారు. వివరాల్లోకి వెళ్తే... పెద్దపల్లి – నిజామాబాద్ రైల్వే లైన్ కోసం జగిత్యాల పరిధిలో రైతుల నుంచి 2006లో సుమారు 100 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ సమయంలో ఎకరాకు రూ. 1.30 లక్షల చొప్పున రైతులకు నష్టపరిహారం చెల్లించారు. విలువైన భూములు తీసుకొని పరిహారం చాలా తక్కువగా ఇచ్చారంటూ రైతులు కోర్టును ఆశ్రయించారు.
విచారణ జరిపిన కోర్టు రైతులకు ఎకరాకు రూ.15,97,200 చెల్లించాలని 2018లో తీర్పు ఇచ్చింది. కానీ సంవత్సరాలు గడిచినా ప్రభుత్వం, ఆఫీసర్లు స్పందించకపోవడం, పరిహారం చెల్లించకపోవడంతో రైతులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీంతో జగిత్యాల ఆర్డీవో ఆఫీస్ సామగ్రిని జప్తు చేయాలని గురువారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు సిబ్బంది ఆర్డీవో ఆఫీస్ వద్దకు చేరుకొని ఫర్నిచర్ను ట్రాక్టర్లో ఎక్కించి కోర్టుకు తరలించారు