మహిళా శక్తితో ఆర్థిక ప్రగతి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

మహిళా శక్తితో ఆర్థిక ప్రగతి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు: మహిళల ఆర్థిక ఎదుగుదలకి ఇందిరా మహిళా శక్తి పథకం ఎంతగానో దోహద పడుతుందని, మహిళలు వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చెందుతున్నారని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్ అన్నారు. జనగామ పట్టణంలోని మున్సిపల్​ఆఫీస్, సబ్​ రిజస్ట్రార్​ఆఫీస్​ ఆవరణలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వనిత టీ స్టాళ్లను శుక్రవారం కలెక్టర్  అడిషనల్​ కలెక్టర్​ పింకేశ్​కుమార్, డీఆర్డీవో వసంత, మున్సిపల్​ కమిషనర్​ మహేశ్వర్​రెడ్డితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకొని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని తెలిపారు. ఈ స్థాళ్ల ద్వారా ఆయా మహిళలకు నిరంతర ఉపాధి కలగడంతో పాటు ఇతర స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆదర్శంగా నిలువనున్నారన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ఉచిత స్కిల్​ ట్రైనింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ  జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో జాబ్​ గ్యారెంటీతో శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. హైదరాబాద్​ విద్యానగర్​లోని శివం రోడ్డు నేషనల్​ స్కిల్​ ట్రైనింగ్​ ఇన్సిట్యూట్​లో ట్రైనింగ్​ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.  అంతకుముందు కలెక్టర్​ను సీపీఎం జనగామ పట్టణ కమిటీ బృందం సభ్యులు పట్టణంలోని వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఆయా సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.