
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ వజీర్ఎక్స్ను నడిపే జన్మై ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన రూ. 64.67 కోట్ల డిపాజిట్లను సీజ్ చేశామని ఈడీ ప్రకటించింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్లోని జన్మై ల్యాబ్స్ డైరెక్టర్ ఆఫీసులో దాడులు నిర్వహించి వీటిని సీజ్ చేశామని వెల్లడించింది. దర్యాప్తునకు నిందితుడు సహకరించడం లేదని ఆరోపించింది. అనేక చైనీస్ లోన్ యాప్లు (మొబైల్ అప్లికేషన్లు) మన దేశంలో చట్టవిరుద్దంగా బిజినెస్ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. వీటిపై కొనసాగుతున్న విచారణలో భాగంగా ఈ క్రిప్టో ఎక్స్ఛేంజీకి వ్యతిరేకంగా ఏజెన్సీ ఈ చర్య తీసుకుంది.
ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఈడీ పోయిన సంవత్సరమే వజీర్ఎక్స్పై అభియోగాలు మోపింది. "వజీర్ఎక్స్ డైరెక్టర్ సమీర్ మాత్రేకే ఎక్స్ఛేంజ్ డేటాబేస్కు పూర్తి రిమోట్ యాక్సెస్ ఉంది. ఈయన చైనీస్ ఇన్స్టంట్ లోన్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బు నుండి కొనుగోలు చేసిన క్రిప్టో ఆస్తులకు సంబంధించిన లావాదేవీల వివరాలను అందించడం లేదు. కేవైసీ నిబంధనలను పట్టించుకోకపోవడం, వజీర్ఎక్స్– బైనాన్స్ మధ్య అనుమానాస్పద లావాదేవీలు, ఖర్చులను ఆదా చేయడానికి బ్లాక్ చైన్లలో లావాదేవీలను రికార్డు చేయకపోవడం, వాలెట్ల కేవైసీని రికార్డు చేయకపోవడం వంటి కారణాల వల్ల డిపాజిట్లను జప్తు చేయాల్సి వచ్చింది" అని ఈడీ ఒక ప్రకటనలో ఆరోపించింది.