
రాత పరీక్ష, ఫిజికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆర్మీకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు బీఎస్సీ, బీఎస్సీ(కంప్యూటర్), బీఏ కోర్సుల్లో ఏదైనా చదవొచ్చు. నేవీకి ఎంపికైనవారు బీటెక్, ఎయిర్ఫోర్స్కు సెలెక్టయినవారు బీఎస్సీ లేదా బీటెక్ చదువుతారు. కోర్సు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినవారికి తర్వాతి దశలో ట్రైనింగ్ ఉంటుంది. ఈ టైంలో నెలకు రూ.56 వేలకు పైగా వేతనాలు పొందడమే కాక సమాజంలో ఉన్నత హోదా, దేశానికి సేవ చేసే సువర్ణావకాశం మీ సొంతం అవుతుంది. ఐదంకెల జీతం, ఉచిత రైల్వే ప్రయాణం, కుటుంబ సభ్యులకూ హెల్త్ కవరేజ్, ఏడాదికి 90 రోజుల సెలవులు వంటి సదుపాయాలు ఉండటంతో దేశం కోసం పనిచేస్తున్నామనే గర్వం నిండిన కొలువు ఇది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ వివరాలు, పరీక్షా విధానం, కోర్సు, సర్వీస్ నిబంధనలు..
ఎగ్జామ్ ప్యాటర్న్: ఇందులో రాత పరీక్ష, ఎస్ఎస్బీ/ఇంటర్వ్యూ అనే రెండు దశలుంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే రాత పరీక్షలో మ్యాథమెటిక్స్ నుంచి 120, జనరల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి 150 ప్రశ్నలు వస్తాయి. ప్రతి పేపర్ కు రెండున్నర గంటల సమయం ఉంటుంది. రాత పరీక్షకు 900, పర్సనాలిటీ టెస్టుకు 900 మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 0.33 శాతం చొప్పున నెగెటివ్ మార్కు ఉంటుంది.
ఫిజికల్ & ఇంటెలిజెన్స్ టెస్ట్: ఆర్మీ, నేవీ విభాగాలను ఎంచుకుని రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి తర్వాతి దశలో సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) ద్వారా ఫిజికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (పీఏటీ), ఇంటెలిజెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఎయిర్ఫోర్స్కు ఎంపికైనవారికి అదనంగా పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ ఉంటుంది. ఎస్ఎస్బీ ఇంటర్య్వూ టెస్టులో రెండు దశలుంటాయి. మొదటి దశలో భాగంగా ఇంటెలిజెన్స్ టెస్ట్లో వెర్బల్, నాన్ వెర్బల్ పindరీక్షలతో పాటు పిక్చర్ పర్సెప్షన్, డిస్క్రిప్టివ్ టెస్టు ఉంటాయి. ఇందులో క్వాలిఫై అయినవారు మాత్రమే రెండో దశకు వెళతారు. ఇందులో సైకలాజికల్ టెస్టులు, గ్రూప్ ఆఫీసర్ టాస్కులు, ఇంటర్వ్యూ, కాన్ఫరెన్స్ ఉంటాయి. సైకలాజికల్ టెస్టులో భాగంగా థిమాటిక్ అప్రిసియేషన్ టెస్టు, వర్డ్ అసోసియేషన్, సిచ్యుయేషన్ రియాక్షన్, సెల్ఫ్ డిస్క్రిప్షన్ పరీక్షలు నిర్వహిస్తారు. గ్రూప్ ఆఫీసర్ టాస్కులో గ్రూప్ డిస్కషన్, గ్రూప్ ప్లానింగ్ ఎక్సైజ్, గ్రూప్ టాస్క్ వంటి రకరకాల టెస్టులుంటాయి. పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్టులో పైలట్కు ఉండాల్సిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా చూస్తారు. చివరగా మెడికల్ టెస్టు ఉంటుంది. వీటిని విజయవంతంగా పూర్తిచేసినవారు ఎంచుకున్న కోర్సులో చేరతారు.
సర్వీస్ రూల్స్: రాత పరీక్ష, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారం గా మెరిట్ రూపొందిస్తారు. దీనిలో ఎంపికయిన అభ్యర్థులు సర్వీస్ లో చేరేముందు బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. దీంతో పాటు పాకెట్ అలవెన్స్, పుస్తకాలు, దుస్తులు, ఆర్మీ ఇన్సూరెన్స్, ఇతర ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ర్ట ప్రభుత్వాలు దాదాపు 27 స్కాలర్షిప్లు అందిస్తున్నాయి. అకాడమీలో చేరిన తర్వాత ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, హిందీలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి హిందీలో అభ్యర్థుల అవగాహనను పరీక్షిస్తారు. ఎంపికైన అభ్యర్థులు సర్వీస్ రూల్స్ తప్పకుండా పాటించాలి.
నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మూడు సంవత్సరాలు అకడమిక్, ఫిజికల్గా శిక్షణ ఇస్తారు. మొదటి రెండున్నర సంవత్సరాలు అందరికీ కామన్ సిలబస్ ఉండగా మిగిలిన ఆరు నెలలు స్పెషలైజ్డ్ సబ్జెక్టు బోధిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన ఆర్మీ క్యాడెట్స్కి బీఎస్సీ/బీఎస్సీ కంప్యూటర్స్, బీఏ డిగ్రీ, నావల్ & ఎయిర్ఫోర్స్ క్యాడెట్స్కి బీటెక్ డిగ్రీని న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి ప్రదానం చేస్తారు. 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీం కింద ప్రవేశించినవారికి కేరళలోని ఇండియన్ నావల్ అకాడమీలో శిక్షణనిచ్చి నాలుగేళ్ల తర్వాత బీటెక్ డిగ్రీని ప్రదానం చేస్తారు.
విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న ఆర్మీ క్యాడెట్స్ను ఇండియన్ మిలిటరీ అకాడమీ (డెహ్రాడూన్), నావల్ క్యాడెట్స్ ను ఇండియన్ నావల్ అకాడమీ (కేరళ), ఎయిర్ఫోర్స్ క్యాడెట్స్ ను హైదరాబాద్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీకి పంపుతారు. ఆర్మీ క్యాడెట్స్ కు ఐఎంఏలో సంవత్సరం పాటు జెంటిల్మెన్ క్యాడెట్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ సమయంలో వీరికి నెలకు రూ.56,100 స్టైపెండ్తో పాటు రూ.15,500 మిలిటరీ సర్వీస్ పే చెల్లిస్తారు. ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆర్మీ క్యాడెట్స్ శాశ్వత ప్రాతిపదికన లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం పొందుతారు. నావల్ క్యాడెట్స్కు ఇండియన్ నేవల్ అకాడమీ లో సంవత్సరం పాటు మళ్లీ శిక్షణనిచ్చి సబ్ లెఫ్టినెంట్ హోదాలో ప్రవేశం కల్పిస్తారు. ఎయిర్ఫోర్స్ క్యాడెట్స్ ఏడాదిన్నర పాటు ఫ్లైయింగ్ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. వీరికి శిక్షణ సమయంలో నెలకు రూ.25000 లభిస్తుంది. శిక్షణ అనంతరం ఫ్లైయింగ్ ఆఫీసర్గా ఉద్యోగం ఇస్తారు. 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీం కింద ప్రవేశించిన అభ్యర్థులు కేరళలోని ఇండియన్ నావల్ అకాడమీ లో నాలుగేళ్ల బీటెక్ కోర్సును చదవాల్సి ఉంటుంది. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి బీటెక్ డిగ్రీని ప్రదానం చేస్తారు.
నోటిఫికేషన్
అర్హత: ఆర్మీ విభాగంలో ప్రవేశానికి ఏదైనా గ్రూప్లో ఇంటర్ ఉత్తీర్ణత. నేవీ, ఎయిర్ఫోర్స్, నావల్ అకాడమీలో ప్రవేశానికి ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత. చివరి ఏడాది పరీక్షలు రాస్తున్న వారూ అర్హులే. నిర్దేశించిన ఫిజికల్, మెడికల్ స్టాండర్డ్స్ కలిగి ఉండాలి.
వయసు:అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు 2జనవరి 2005కి ముందు, 1 జనవరి 2008కి తర్వాత జన్మించి ఉండకూడదు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష సెప్టెంబర్ 3న నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. పూర్తి వివరాలకు www.upsconline.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏటా రెండు సార్లు నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) & నావల్ అకాడమీ (ఎన్ఏ) (2) ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా త్రివిధ దళాల్లో శాశ్వత కమీషన్డ్ అఫీసర్ల హోదాలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. కేవలం ఇంటర్మీడియట్ అర్హతతోనే ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, నావల్ అకాడమీల్లో లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్, ఫ్లైయింగ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగంతో పాటు బీఏ, బీఎస్సీ, బీటెక్ పట్టా పొందే అద్భుత అవకాశం ఇందులో ఉంటుంది. కోర్సు, శిక్షణ ద్వారా ఉద్యోగం కల్పిస్తారు. ఈసారి ఎన్డీఏ & ఎన్ఏ పరీక్ష ద్వారా యూపీఎస్సీ 395 ఖాళీలను భర్తీ చేయనుంది.