
సంగారెడ్డి టౌన్ , వెలుగు: ప్రభుత్వ వైద్య కాలేజీలో మౌలిక వసతుల కల్పన, స్టైఫెండ్ పెంపు, పెండింగ్స్కాలర్షిప్ తదితర సమస్యల పరిష్కారానికి జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఈ నెల 30 నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మంత్రి దామోదర స్పందించి సంగారెడ్డిలోని తన నివాసంలో అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి స్టైఫెండ్ను 15 శాతం పెంచుతూ జీవో విడుదలచేశారు.
అంచలంచెలుగా ప్రభుత్వ వైద్య కాలేజీలో మౌలిక వసతుల కల్పన, ప్రొఫెసర్ల నియామకం చేపట్టనున్నట్లు తెలిపారు. పెండింగ్ స్టైఫెండ్ సైతం సోమవారంలోగా స్టూడెంట్స్ ఖాతాలో వేసేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అర్హత కలిగిన వారికి పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో రెగ్యులర్ ప్రిన్సిపాల్, వసతిగృహాలకు రెగ్యులర్ సూపరింటెండెంట్లను నియమించారు.