ఆలిండియా ఫుట్బాల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కళ్యాణ్ చౌబే ఎన్నికయ్యాడు. బైచుంగ్ భూటియాపై 33-1 ఓట్ల తేడాతో కళ్యాణ్ చౌబే గెలుుపొందాడు. బైచుంగ్ భూటియాకు కేవలం ఒకే ఒక్క ఓటు పడటం గమనార్హం. చౌబేకు 33 ఓట్లు పోలయ్యాయి. వీరిద్దరూ ఫుట్బాల్ మాజీ ఆటగాళ్లు. ఇక 85 ఏళ్ల ఫుట్బాల్ అసోసియేషన్ చరిత్రలో మాజీ ప్లేయర్ అధ్యక్షుడిగా ఎంపికవడం ఇదే ఫస్ట్ టైం.
ఒక్కసారి కూడా టీమిండియాకు ఆడలే..
45 ఏళ్ల కళ్యాణ్ చౌబే ..గతంలో మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ జట్లకు ఆడాడు. అయితే ఒక్కసారి కూడా భారత పుట్బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. కొన్ని సందర్భాల్లో జట్టుకు ఎంపికయ్యాడు. కానీ మైదానంలో మాత్రం బరిలోకి దిగలేదు. ఇక వయసు ఆధారిత ఇంటర్నేషనల్ టోర్నీల్లో మాత్రం భారత్కు ఆడాడు. కల్యాణ్ చౌబే టాటా పుట్బాల్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 1996 గోల్డెన్ బ్యాచ్ నుంచి పాస్ఔట్ అయ్యాడు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున కృష్ణా నగర్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఈస్ట్ బెంగాల్ జట్టులో బైచుంగ్ భుటియా, చౌబీ సహచరులే కావడం గమనార్హం.
భూటియాకు మద్ధతు కరువు..
భారత ఫుట్బాల్ జట్టులో 'సిక్కిమీస్ స్నైపర్'గా పేరు పొందిన బైచుంగ్ భుటియాకు అధ్యక్ష ఎన్నికల్లో మాత్రం మద్దతు లభించలేదు. 34 రాష్ట్ర సంఘాల ప్రతినిధుల్లో అతనికి ఒక్కరే ఓటు వేశారు. నామినేషన్ సమయంలో తన సొంత రాష్ట్ర సంఘం సిక్కిం నుంచీ ప్రతిపాదించినవారు లేరు. టీమిండియా తరఫున భూటియా 104 మ్యాచుల్లో 40 గోల్స్ కొట్టాడు. 2011లో ఆటకు వీడ్కోలు పలికాడు.1999లో ఐరోపా క్లబ్తో ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారత ప్లేయర్గా బైచుంగ్ రికార్డు సృష్టించాడు. ఇంగ్లిష్ టీమ్ బరీకి ఆడాడు. మోహన్ బగాన్, తూర్పు బంగాల్, సెలాంగోర్, యునైటెడ్ సిక్కిం క్లబ్లకు కూడా ఆడాడు.
కర్ణాటక ఫుట్బాల్ సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే NA హ్యారిస్ ఆలిండియా ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అతను రాజస్థాన్ FAకు చెందిన మన్వేంద్ర సింగ్ను ఓడించారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రతినిధి కిపా అజయ్ ఆంధప్రదేశ్ అభ్యర్థి గోపాల్కృష్ణ కొసరాజును ఓడించి కార్యదర్శిగా గెలిచారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా 14 మంది ఎంపికయ్యారు.