
- ఘటన జరిగిన 24గంటల్లోపే నిందితుల అరెస్టు
- 2015లో వివాదాస్పద స్పీచ్ పై ఆగ్రహం..
- పక్కాగా స్కెచ్ వేసుకుని హత్య
లక్నో: హిందూ సమాజ్ పార్టీ నేత కమలేశ్ తివారీ హత్య కేసును 24 గంటల్లోపే చేధించారు పోలీసులు. శుక్రవారం మధ్యాహ్నం లక్నోలోని తివారీ ఇంట్లోకి వచ్చి గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు గంటల సమయంలోనే నిందితులను పట్టుకున్నారు.
ఉగ్రవాదుల హస్తం లేదు

గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, యూపీ పోలీసుల జాయింట్ టీం గుజరాత్ లోని సూరత్ లో ముగ్గురిని అరెస్టు చేసిందని యూపీ డీజీపీ ఓం ప్రకాశ్ సింగ్ చెప్పారు. నిందితుల పేర్లు మౌలానా మోసిన్, ఫైజాన్, రషీద్ అహ్మద్ పఠాన్ అని తెలిపారు. పక్కాగా ప్లాన్ చేసి తివారీ హత్య చేసినట్లు వాళ్లు ఒప్పుకొన్నారని డీజీపీ చెప్పారు.
2015లో తివారీ ఓ ప్రసంగంలో మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల తమ మనోభావాలు దెబ్బతినడంతో ఈ హత్య చేశారని తెలిపారు. ఈ హత్య వెనుక ఐఎస్ఐస్ ఉగ్రవాదుల హస్తం ఉందని తొలుత భావించామని, ప్రాథమిక దర్యాప్తు తర్వాత అలాంటిదేమీ లేదని తేలిందని చెప్పారాయన.
ప్రస్తుతం సూరత్ లోనే ఇంటరాగేషన్ జరుగుతోందని, అవసరమైతే యూపీ తీసుకొచ్చి ప్రశ్నిస్తామని డీజీపీ ఓం ప్రకాశ్ సింగ్ చెప్పారు.