టీవీ సీరియల్స్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో ఎత్తుకెదిగిన యంగ్ హీరో సుశాంత్ రాజ్పుత్ ఆత్మహత్య మరువక ముందే మరో యువ తార అదే తరహాలో ప్రాణాలు వదలడం సినీలోకాన్ని విషాదంలోకి నెట్టేసింది. కర్ణాటకలో టీవీ సీరియల్స్లో గుర్తింపు సంపాదించి ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటున్న యంగ్ స్టార్ సుశీల్ గౌడ ఆత్మహత్య చేసుకున్నాడు. 30 ఏళ్ల వయసున్న ఈ కన్నడ యాక్టర్ మాండ్యలోని తన ఇంట్లో మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి పాల్పడడానికి కారణం తెలియాల్సి ఉంది. అంతఃపుర అనే రొమాంటిక్ సీరియల్లో నటించిన సుశీల్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల్లో హీరో కావాలన్న లక్ష్యం పెట్టుకున్న అతడికి ఇప్పుడిప్పుడే శాండిల్వుడ్లో సినిమా చాన్స్లు వస్తున్నాయి. హీరో దునియా విజయ్ నటిస్తున్న సలగా మూవీలో పోలీస్ రోల్ చేశాడు సుశీల్. ఈ సినిమా రిలీజ్ కాకముందే అతడు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదలడం ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్లోకి నెట్టిసింది. యాక్టింగ్తో పాటు ఫిట్నెస్ ట్రైనర్ కూడా అయిన సుశీల్ ఇలా అకస్మాత్తుగా ప్రాణాలు తీసుకోవడంపై అతని స్నేహితులు, టీవీ సీరియల్స్, శాండిల్వుడ్ కోస్టార్ట్, పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సుశీల్ మృతిపై అంతఃపుర సీరియల్లో సహ నటి అయిన అమితా రంగనాథ్ స్పందించింది. అతడి మరణ వార్త తెలిసి షాక్కు గురయ్యానని, సుశీల్ చనిపోయాడంటే నమ్మలేకపోతున్నానంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ‘సుశీల్ చాలా మంచి వ్యక్తి. ఎప్పుడు చాలా కూల్గా ఉంటాడు. ఇంత చిన్న వయసులో సుశీల్ మరణించడం చాలా బాధ కలిగిస్తోంది’ అని పేర్కొంది.
'ಸಲಗ' ಚಿತ್ರದಲ್ಲಿ ಒಂದು ಒಳ್ಳೆಯ ಪೊಲೀಸ್ ಪಾತ್ರವಿದೆ. ಅದನ್ನು ಒಬ್ಬ ಸ್ಫುರದ್ರೂಪಿ ಹುಡುಗ ನಿರ್ವಹಿಸಿದ್ದ. ಆತನ ಹೆಸರು ಸುಶೀಲ್ ಅಂತ….
Posted by Duniya Vijay on Wednesday, July 8, 2020
మంచి హీరో అవుతాడనుకున్నా, కానీ..
సలగా మూవీ హీరో దునియా విజయ్ తన ఫేస్బుక్ పేజీలో సుశీల్ ఆత్మహత్య గురించి భావోద్వేగ పోస్ట్ చేశారు. అతడిని చూసిన మొదటి లుక్లోనే హీరో అవుతాడని, మంచిగా ఎదుగుతాడని అనుకున్నానని అన్నారు. తన సినిమాలో ఒక మంచి పోలీస్ రోల్ చేశాడని, సినిమా రిలీజ్ కాకముందే మనల్ని విడిచిపోవడం చాలా బాధాకరమని చెప్పారు. ఎటువంటి సమస్య వచ్చినా ఆత్మహత్య చేసుకోవడం పరిష్కారం కాదన్నారు. ఈ ఏడాదిలో ఇకపై ఇలాంటి మరణాలు ఉండవని ఆశిస్తున్నానని అన్నారు. ప్రజల్లో కూడా కరోనా వైరస్ భయం నెలకొని ఉందని, దీనికి తోడు ఉద్యోగం పోయి, పని లేక డబ్బులు దొరక్క ఇబ్బందులు పడుతున్న వారు ధైర్యంగా ముందుకు సాగాలని, ఏ ఒక్కరూ కూడా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని కోరుతున్నానని అన్నారు. ఆత్మహత్యల వల్ల ఆ వ్యక్తి చనిపోయాక, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు పడే క్షోభ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. కష్టాలు వస్తే ఎలా ఎదుర్కొని నిలబడాలనేది మన పురాణాలు నేర్పుతాయని, వాటిని కేవలం చదవడమే కాదని ఆచరణలో పెట్టాలని, సీతారాములను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు విజయ్.