నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ గా రూరల్ సెగ్మెంట్కు చెందిన కాట్పల్లి నగేశ్రెడ్డి నియామకమయ్యారు. పార్టీలో సుదీర్ఘకాలంగా పని చేసిన ఆయనకు హైకమాండ్ జిల్లా బాధ్యతలు అప్పగించింది. డీసీసీ పోస్టుకు15 మంది పోటీపడగా పలు అంశాల ప్రతిపాదికన నగేశ్రెడ్డికి అవకాశం దక్కింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు రూరల్ సెగ్మెంట్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నామినేటెడ్పోస్టుపై అశలు పెట్టుకున్నారు. ఆయనకు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్రెడ్డి పూర్తి మద్దతు లభించడంతో సక్సెస్ అయ్యారు. డిచ్పల్లి మండలంలోని ముల్లంగి గ్రామానికి చెందిన కాట్పల్లి నగేశ్రెడ్డి యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.
మొదట సర్పంచ్గా, మోపాల్ సింగిల్ విండో చైర్మన్గా పని చేశారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీకి పదేండ్లు చైర్మన్గా 2014 వరకు కొనసాగారు. పీసీసీ సెక్రటరీగా వ్యవహరించి జనరల్ సెక్రటరీగా ఎదిగి ఇప్పుడు కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవికి ఎంపికయ్యారు.
కామారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్గా మల్లికార్జున్
కామారెడ్డి: కామారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్గా మల్లికార్జున్ను ఏఐసీసీ నియమించింది. డీసీసీ ప్రెసిడెంట్ల నియమాకం కోసం ఏఐసీసీ నియమించిన పరిశీలకులు అక్టోబర్ లో జిల్లాలో పర్యటించారు. నియోజకవర్గాల వారీగా మీటింగ్లు నిర్వహించి పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించారు. డీసీసీకి 30 మంది లీడర్లు అప్లయ్ చేసుకున్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలానికి చెందిన మల్లికార్జున్ను ఏఐసీసీ నియమించింది.
