హైదరాబాద్, వెలుగు: కేంద్రం బడ్జెట్ సమావేశాల్లో వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్ ప్రతిపాదన తీసుకు వచ్చిందని, దాంతో కేసీఆర్కు భయం పట్టుకుందని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్అన్నారు. అందుకే కొత్త రాజ్యాంగమనే కొత్త పాట ఎత్తుకున్నారని తెలిపారు. ధరణి పోర్టల్లోపాల పుట్టగా ఉందని, రైతులు అవస్థలు పడుతున్నారని ఆయన మండిపడ్డారు. రైతులను భయాందోళనకు గురి చేయడానికే కేసీఆర్ ఈ పోర్టల్ తీసుకొచ్చారని ఆరోపించారు. దీనిపై ఉద్యమం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించిందని తెలిపారు. సోమవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ధరణి పోర్టల్లో అనుభవదారు కాలమ్ఎత్తేయడం ఒక కుట్ర అన్నారు. దీని వల్ల వివిధ రూపాల్లో భూములు పొందిన వారు నష్టపోయే అవకాశముందన్నారు. పేదల భూములను ప్రభుత్వం హరితహారం, ప్రకృతి వనాలు, రకరకాల ప్రాజెక్టుల పేరుతో లాక్కుంటోందన్నారు. వందలాది ఎకరాల భూములు వివాదాల్లో ఉన్నాయని, వీటిని పాత యాజమాన్యాలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ సమస్యలపై లీగల్ అడ్వయిజర్లతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.