ఇందిరమ్మ ఇండ్లకు.. రూ.3 వేలు కరెంటు బిల్లు వసూలు చేస్తున్రు

ఇందిరమ్మ ఇండ్లకు.. రూ.3 వేలు కరెంటు బిల్లు వసూలు చేస్తున్రు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లకు రూ.3 వేల కరెంట్​ బిల్లు వసూలు చేస్తున్నారని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 ఏండ్ల కింద ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లలో కేసీఆర్  సర్కార్​ విజిలెన్స్  దాడులు చేయించి కరెంట్​ బిల్లులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

ALSO READ :గతంలో కరెంట్ అడుక్కుంటే.. ఇప్పుడు పొరుగు రాష్ట్రాలకు ఇస్తున్నాం

ఇందిరమ్మ ఇంటి పేరు మీద రూ.3 వేలు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్లకు ప్రాపర్టీ ట్యాక్స్, పెనాల్టీలు వేస్తున్నారని ఆరోపించారు. ఉచిత కరెంట్​ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 12 గంటలు కూడా కరెంట్​ ఇవ్వడం లేదని, కేఎల్ఐ, జూరాల నీళ్లు లేక ఎండిపోయాయని, రైతులు వేసిన విత్తనాలు ఎండి పోయాయని తెలిపారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి అర్థం రవి, టి పాండు, కోటయ్య, కౌన్సిలర్  నిజాముద్దీన్  పాల్గొన్నారు.