పోరు తెలంగాణ : 2009 డిసెంబర్ నుంచి ఉద్యమంలో ఒక్కటిగా కదిలి

పోరు తెలంగాణ : 2009 డిసెంబర్ నుంచి ఉద్యమంలో ఒక్కటిగా కదిలి

ఆదిలాబాద్​ అడవుల నుంచి.. ఖమ్మం గుమ్మం దాకా..! పాలమూరు పల్లెల నుంచి.. మెతుకుసీమ గడపల దాకా..! ఓరుగల్లు కోటల నుంచి.. హైదరాబాద్​ గల్లీల దాకా..! ఇందూరు, కరీంనగర్​, నల్లగొండ, రంగారెడ్డి.. ఊరూవాడా.. కలబడి నిలబడితే వచ్చిందీ తెలంగాణ. ఇది పోరాటాల ఖార్ఖానా. ఒక్కరా.. ఇద్దరా.. వందలు వేలమంది చావును ముద్దాడుతూ.. వదిలిన ఊపిరే ఈ తెలంగాణ. ఇది త్యాగాల వీణ!! ‘మా కొలువులు మాగ్గావాలె’ అనే నినాదంతో మొదలైన ఉద్యమం.. ఉవ్వెత్తున ఎగిసింది. స్వరాష్ట్ర కాంక్షను రగిలించింది. ఆరు దశాబ్దాలకుపైగా అలుపెరగని పోరాటాలతో 2014 జూన్​ 2న రాష్ట్రం సిద్ధించింది. ఈ పోరు వెనుక ఎన్నో కీలక ఘట్టాలు.. మరెన్నో మైలు రాళ్లు. వాటిని ఒక్కసారి యాదికి తెచ్చుకుందాం...

ఒక్కటిగా కదిలి 

 

  • 2009 డిసెంబర్​ 24:  తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ప్రకటించడంతో తెలంగాణ రగిలిపోయింది. ఐక్యంగా పోరాడేందుకు ప్రొఫెసర్​ కోదండరాం చైర్మన్​గా తెలంగాణ జాయింట్​ యాక్షన్​ కమిటీ (టీజేఏసీ) ఏర్పాటు. 
  • 2010 ఫిబ్రవరి 3: ప్రత్యేక తెలంగాణ అంశంపై ఐదుగురు సభ్యులతో జస్టిస్​ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసిన అప్పటి కేంద్ర ప్రభుత్వం. 
  • 2010 మే 28: తెలంగాణ ఉద్యమంలో మానుకోట రాళ్లదాడిదీ ప్రత్యేక స్థానం. లోక్​సభలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్లకార్డును ప్రదర్శించిన వైఎస్​ జగన్మోహన్​ రెడ్డి.. ఓదార్పు యాత్రను మానుకోట నుంచి ప్రారంభించాలని నిర్ణయించడంతో ఉద్యమకారులు ఆగ్రహించారు. మానుకోట రైల్వే స్టేషన్​ను ముట్టడించారు. ‘జగన్​ గో బ్యాక్’​ అంటూ నినదించారు.  
  • 2010 డిసెంబర్​ 30: ఆరు ఆప్షన్లతో రిపోర్ట్​ ఇచ్చిన జస్టిస్​ శ్రీకృష్ణ కమిటీ. 
  • 2011 మార్చి 10: తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ట్యాంక్​బండ్​పై మిలియన్​ మార్చ్​. ఉద్యమకారులు, ప్రజలు, వివిధ పార్టీల నేతలు భారీగా తరలిరావడంతో ఆ మార్చ్​ సక్సెస్​ఫుల్​ అయింది. పోలీసుల నిర్బంధాల మధ్యనే మార్చ్​సాగింది. ఎవరూ రాకుండా జిల్లాల్లో పోలీసుల నిర్బంధాలు. మొత్తంగా లక్ష మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకోగా.. ఒక్క హైదరాబాద్​లోనే 11 వేల మందిని అరెస్ట్​ చేశారు. 
  • 2011 సెప్టెంబర్​ 12: కరీంనగర్​లో టీఆర్​ఎస్​ ప్రజా సదస్సు. అందులో టీజేఏసీ​, బీజేపీ, న్యూడెమోక్రసీ నాయకులూ పాల్గొన్నారు. 
  • 2011 సెప్టెంబర్​ 13: 42 రోజుల పాటు సాగిన సకల జనుల సమ్మె ప్రారంభమైన రోజు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులందరూ ఇందులో భాగమయ్యారు. 
  • 2013 జులై 30: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ (యునైటెడ్​ ప్రోగ్రెసివ్​ అలయన్స్​‌– అప్పటి కేంద్ర ప్రభుత్వంలోని కాంగ్రెస్​, మిత్ర పక్షాల కూటమి) కో ఆర్డినేషన్​ కమిటీ, కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీల నిర్ణయం. 
  • 2013 అక్టోబర్​ 3: తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం. 
  • 2013 అక్టోబర్​ 25: రాష్ట్ర విభజనను ఆపాలంటూ అప్పటి సీఎం  కిరణ్​ కుమార్​ రెడ్డి కాంగ్రెస్​ నాయకత్వానికి వ్యతిరేకంగా నిరసన. 
  • 2013 డిసెంబర్​ 5: ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013కి ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి మండలి. బిల్లు ఆమోదానికి ప్రెసిడెంట్​ ప్రణబ్​ ముఖర్జీకి పంపిన కేంద్రం. 
  • 2013 డిసెంబర్​ 9: అభిప్రాయాలు చెప్పాలంటూ రాష్ట్ర అసెంబ్లీకి ప్రెసిడెంట్​ గడువు. జనవరి 23 వరకు గడువు విధింపు. 
  • 2013 డిసెంబర్​ 12: ప్రత్యేక విమానంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ హైదరాబాద్​కు ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు తరలింపు. 
  • 2013 డిసెంబర్​ 16: శాసనసభ, మండలిలో బిల్లును ప్రవేశపెట్టిన నేతలు. సీమాంధ్ర, తెలంగాణ నేతల మధ్య కొట్లాట. 
  • 2014 జనవరి 27: బిల్లును తిరస్కరించాలంటూ అప్పటి స్పీకర్​కు నోటీసులిచ్చిన సీఎం కిరణ్​ కుమార్​ రెడ్డి. 
  • 2014 జనవరి 30: తీవ్ర ఆందోళనల మధ్యే బిల్లును వ్యతిరేకిస్తూ మూజువాణీ (వాయిస్​) ఓట్​ ద్వారా  తీర్మానించిన అసెంబ్లీ. బిల్లును పార్లమెంట్​కు పంపొద్దని ప్రెసిడెంట్​కు విజ్ఞప్తి. 
  • 2014 ఫిబ్రవరి 5: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో కిరణ్​ కుమార్​ రెడ్డి నిరసన.
  • 2014 ఫిబ్రవరి 7: హైదరాబాద్​ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న సీమాంధ్ర నేతల విజ్ఞప్తిని తిరస్కరిస్తూ.. బిల్లుకు కేంద్ర కేబినెట్​ ఆమోదం. పార్లమెంట్​లో ప్రవేశపెట్టేలా బిల్లు ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపిన కేబినెట్​. 
  • 2014 ఫిబ్రవరి 11: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలపై కాంగ్రెస్​ పార్టీ బహిష్కరణ.
  • 2014 ఫిబ్రవరి 13: తెలంగాణ, సీమాంధ్ర ఎంపీల మధ్య ఘర్షణల నడుమ లోక్​సభలో బిల్లు పెట్టిన కేంద్రం. తోటి సభ్యులపై పెప్పర్​ స్ప్రేని ప్రయోగించిన అప్పటి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్. లగడపాటి సహా 16 మంది ఎంపీలను సస్పెండ్​ చేసిన స్పీకర్.​
  • 2014 ఫిబ్రవరి 18: ఆంధ్ర ప్రదేశ్​ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పాస్​ చేసిన లోక్​సభ
  • 2014 ఫిబ్రవరి 20: రాజ్యసభలోనూ బిల్లుకు ఆమోదం. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన అప్పటి ప్రధాని మన్మోహన్​ సింగ్​. 
  • 2014 మార్చి 1: తెలంగాణ బిల్లుకు నాటి రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ ఆమోదం. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధింపు. 
  • 2014 ఏప్రిల్​ 30: తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్​సభ స్థానాలకు ఎన్నికల నిర్వహణ. 
  • 2014 మే 16: 63 అసెంబ్లీ స్థానాలు, 11 లోక్​సభ సీట్లను గెలిచి అధికారంలోకి వచ్చిన టీఆర్​ఎస్​ పార్టీ. 
  • 2014 జూన్​ 2: ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం. రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్​ ప్రమాణ స్వీకారం.