![సోషల్ మీడియాలో మతాన్ని రెచ్చగొట్టే పోస్టులు.. 54కేసులు నమోదు](https://static.v6velugu.com/uploads/2023/11/kerala-blasts_cbmoUEDAeq.jpg)
కొచ్చిలోని కలమస్సేరి సమీపంలో క్రైస్తవ ప్రార్థనా సమావేశంలో ఇటీవల జరిగిన పేలుళ్ల తర్వాత సామాజిక మాధ్యమాల ద్వారా మతపరమైన రెచ్చగొట్టే కంటెంట్ను వ్యాప్తి చేసినందుకు 54 కేసులు నమోదు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు.
శనివారం (నవంబర్ 4) మలప్పురం జిల్లాలో అత్యధికంగా 26 కేసులు నమోదయ్యాయని, ఎర్నాకులంలో 15, తిరువనంతపురంలో ఐదు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. త్రిసూర్ సిటీ, కొట్టాయంలో ఒక్కొక్కటి రెండు కేసులు నమోదవగా, పతనంతిట్ట, అలప్పుజా, పాలక్కాడ్ మరియు కోజికోడ్ రూరల్లలో ఒక్కో కేసు నమోదైంది. మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్ట్లను షేర్ చేయడానికి ఉపయోగించిన అనేక నకిలీ ప్రొఫైల్లను గుర్తించినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇలాంటి నకిలీ ప్రొఫైల్ల ఐపీ అడ్రస్లను గుర్తించాలని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, వాట్సాప్ తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లకు అభ్యర్థనలు వచ్చాయి. రాష్ట్రంలోని సైబర్ సెల్ అటువంటి హ్యాండిల్స్ను గుర్తించడానికి 24 గంటలు పనిచేస్తోంది. రిమోట్ కంట్రోల్డ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) వల్లే ఈ పేలుడు సంభవించిందని కేరళ పోలీసులు గతంలో తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఐఈడీ పేలుడుకు కొనుగోలు చేసిన వస్తువుల బిల్లులు కూడా నిందితుడి వద్ద ఉన్నాయని పోలీసులు తెలిపారు. డొమినిక్ ఎక్కడ వస్తువులు కొనుగోలు చేసినా, ఆయా ప్రదేశాల్లో వీడియోలు రూపొందించాడు.
కలమస్సేరిలోని జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఓ వీడియో ఆధారంగా మార్టిన్ను కొచ్చి పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఇక్కడ ప్రార్థనా సమావేశానికి 2వేల మంది యెహోవాసాక్షులు, క్రైస్తవ వర్గానికి చెందినవారు తరలివచ్చారు. ఈ ఘటనల అనంతరం ముఖ్యమంత్రి విజయన్ దీనిపై దర్యాప్తు చేసేందుకు 20 మంది సభ్యులతో కూడిన దర్యాప్తు బృందాన్ని ప్రకటించారు.
സാമൂഹികമാധ്യമങ്ങളിലെ വ്യാജപ്രചാരണം: 54 കേസുകള് രജിസ്റ്റര് ചെയ്തു#keralapolice pic.twitter.com/8bEWf0xfBx
— Kerala Police (@TheKeralaPolice) November 4, 2023