
ట్రాఫిక్ రూల్స్ పాటించట్లేదని ఇప్పటికే కేంద్రం ఫైన్లను భారీగా పెంచేసింది. జనాల నడ్డి విరుగుతుందని కొన్ని రాష్ట్రాలు కొత్త చట్టాన్ని అమలు చేయట్లేదు. దాన్నే కొందరు డ్రైవర్లు అలుసుగా తీసుకుంటున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఇదిగో అలాంటిదే ఈ ఘటన. ఓ బస్సు డ్రైవర్ తన దారిలో కాకుండా, రాంగ్రూట్లో దారి తప్పి బస్సును నడిపాడు. అప్పుడు అదే రూట్లో (కరెక్ట్) ఓ మహిళ స్కూటీపై వస్తోంది. నాకెందుకులే అని అనుకోలే. పక్కకు తప్పుకుని పోలే. బస్సుకు ఎదురుగా బండిని ఆపింది. లెఫ్ట్ తీసుకుని కరెక్ట్ రూట్లోకి బస్సు మళ్లేదాకా అలాగే చూసింది. తప్పుకోమని దారినపోయేటోళ్లు, బస్సు డ్రైవర్ చెప్పినా వినిపించుకోలే. ముందు నువ్వు కరెక్ట్ రూట్లోకి మారు, అప్పుడే నేను తప్పుకునేది అంటూ రోడ్డు మధ్యలో అలాగే ఉండిపోయింది. దీంతో ఆ బస్సు డ్రైవర్ తోక ముడవక తప్పలేదు. రూటు మార్చుకోక తప్పలేదు. రైట్ రూట్లో బస్సు వెళ్లాకగానీ ఆమె అక్కడి నుంచి కదల్లేదు. ఈ ఘటన కేరళలోని కాసర్గోడ్లో జరిగింది.