లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి దారుణ హత్య?

లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి దారుణ హత్య?

ఖమ్మం జిల్లా లేబర్ ఆఫీసర్ మోకు ఆనంద్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారనే వార్త కలకలం రేపుతోంది. ఈనెల 7 వ తేదీన ఒక హోటల్ నుంచి ప్రదీప్ రెడ్డి అనే వ్యాపారితో కలిసి బయటకు వెళ్లిన ఆనంద్ రెడ్డి..  ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. కాల్ చేసినా కూడా సిగ్నల్ దొరక్కపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెంది హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జనగామ జిల్లా ఓబుల్ కేశవాపూర్ వాసి అయిన ఆనంద్ రెడ్డి ఖమ్మంలో లేబర్ ఆఫిీసర్ గా  పనిచేస్తున్నారు.  మూడు రోజులుగా ఆచూకీ లేకుండా పోయిన ఆనంద్ రెడ్డి మంగళవారం భూపాలపల్లి జిల్లా గోళ్లబుద్ధారం అడవిలో దారుణ హత్య చేయ బడ్డాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆర్థిక లావాదేవీల కారణంగానే  ప్రదీప్ రెడ్డి..  ఆనంద్ రెడ్డిని కిడ్నాప్ చేసినట్లు,  ఆయనే హత్య చేసినట్లు ఆనంద్ రెడ్డి కుటుంబ సభ్యులు  అంటున్నారు.

మూడు రోజుల క్రితం డబ్బులిస్తామంటూ ఆనంద్ రెడ్డిని ప్రదీప్ రెడ్డి కారులో హైదరాబాద్ కు తీసుకువచ్చాడని సమాచారం. ప్రస్తుతం ప్రదీప్‌రెడ్డి కారును హైదరాబాద్‌లోని అల్వాల్‌లో గుర్తించారు పోలీసులు. ఇంతవరకూ ఆనంద్ రెడ్డి డెడ్ బాడీ  దొరకకపోవడంతో పోలీసులు నుంచి కూడా హత్యపై సరైన సమాచారం లేదు. హత్య జరిగిన ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు ..  మరి కాసేపట్లో పూర్తి వివరాలు తెలుపనున్నారు.