ఖానాపూర్, వెలుగు: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఖానాపూర్ పట్టణంలోని మార్కెట్ యార్డు ఆవరణలో పీఏసీఎస్, మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తమ పంట ఉత్పత్తులను విక్రయించాలని సూచించారు.
పదేండ్లపాటు రైతులను గత బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందని ఆరోపించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ భూషణ్, వైస్చైర్మన్అబ్దుల్ మాజిద్, మున్సిపల్ మాజీ చైర్మన్లు సత్యం, రాజేందర్, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దయానంద్, రమేశ్, ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, తహసీల్దార్ సుజాత రెడ్డి, నాయకులున్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు
కడెం, వెలుగు: రాష్టంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. కడెం మండలంలోని చిన్న బెల్లాల్ గ్రామంలో తోటిగూడెం గిరిజనులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్కాపీలను శనివారం అందజేశారు. అనంతరం పలువురి ఇండ్లకు భూమిపూజ చేశారు. లబ్ధిదారులు సకాలంలో ఇండ్లు నిర్మించుకోవాలని సూచించారు.
ధర్మాజీపేట్ కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త రొడ్డ చందు రోడ్డు ప్రమాదంలో, గాజుల నరేశ్ గుండెపోటుతో మృతిచెందగా.. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఎంపీడీవో అరుణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశ్, నాయకులు గొల్ల వెంకటేశ్, శంకర్, లచ్చన్న, రాజన్న, లిబ్బారావు, వెంకటేశ్తదితరులు పాల్గొన్నారు.
