
బటుమి (జార్జియా): ఇండియా లెజెండరీ ప్లేయర్ కోనేరు హంపి, యంగ్ సెన్సేషన్ దివ్య దేశ్ముఖ్ మధ్య ప్రతిష్టాత్మక ఫిడే విమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ డ్రాతో మొదలైంది. శనివారం జరిగిన తొలి క్లాసికల్ గేమ్ను ఇరువురు ప్లేయర్లు డ్రా చేసుకున్నారు. హోరాహోరీగా సాగిన ఆటలో ఇద్దరికీ గెలుపు అవకాశాలు లభించినా చివరికి పాయింట్ పంచుకున్నారు. తెల్లపావులతో ఆడిన 19 ఏండ్ల దివ్య ఆట ప్రారంభంలోనే ఒక పావును త్యాగం చేసి హంపిపై ఒత్తిడి పెంచింది. 14వ ఎత్తులో దివ్యకు గెలిచే గోల్డెన్ చాన్స్ లభించినా తను దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది.
ఆ తర్వాత ఇద్దరూ సమవుజ్జీలుగా తలపడ్డారు. ఆట చివరి దశలో 41వ ఎత్తులో హంపి తన రూక్ను త్యాగం చేసి ‘పెర్పెచువల్ చెక్’ ద్వారా గేమ్ను డ్రాగా ముగించింది. ఆదివారం జరిగే రెండో క్లాసికల్ గేమ్లో తెల్లపావులతో ఆడటం హంపికి సానుకూలాంశం కానుంది. ఇందులో గెలిచిన వాళ్లకు టైటిల్ లభిస్తుంది. ఈ గేమ్ కూడా డ్రా అయితే విన్నర్ను తేల్చేందుకు సోమవారం టై-బ్రేకర్ గేమ్స్ నిర్వహిస్తారు.