
- సాగర్లో 545 అడుగులు దాటిన నీటిమట్టం
గద్వాల/శ్రీశైలం/హాలియా, వెలుగు : కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి నీరు విడుదల అవుతుండడంతో జూరాలకు 1.09 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. జూరాల వద్ద 10 గేట్లు ఎత్తి 67,420 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం ప్రాజెక్ట్లో 882.90 అడుగుల మేర నీరు చేరింది. ఎగువ నుంచి మొత్తం 1,41,105 క్యూసెక్కుల వరద వస్తుండడంతో శ్రీశైలం మూడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.
ఇక్కడి నుంచి గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా మొత్తం 1,48,868 క్యూసెక్కుల నీటిని సాగర్కు వదులుతున్నారు. శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో నాగార్జునసాగర్ నీటి మట్టం రోజుకు ఐదు అడుగుల చొప్పున పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు సాగర్లో 545.30 అడుగుల మేర నీరు చేరింది. సాగర్ నుంచి ఏఎంఆర్పీ, మెయిన్ పవర్ హౌజ్ ద్వారా 5,244 క్యూసెక్కు నీటిని విడుదల చేస్తున్నారు.