
హైదరాబాద్, వెలుగు: కృష్ణా నీళ్ల పంచాయితీలో తలమునకలైన రెండు రాష్ట్రాలు.. ముందు బోర్డు నిర్వహణకు నిధులివ్వాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్బోర్డ్(కేఆర్ఎంబీ) కోరింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల నుంచి రావాల్సిన బకాయిలపై లేఖ ద్వారా అలర్ట్ చేసింది. నిధులివ్వకుంటే బోర్డు నడపలేమని.. అధికారులు, ఇంజనీర్లు, సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తలెత్తిందని స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాలు వెంటనే చెరో రూ.4.50 కోట్ల చొప్పున రూ.9 కోట్లు విడుదల చేయాలని కోరింది. కేఆర్ఎంబీ ఏర్పడిన నాటి నుంచి నిరుటి దాకా తెలంగాణ ప్రభుత్వం రూ.13.71 కోట్లు, ఏపీ రూ.12.56 కోట్ల నిధులు ఇచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు రూ.23.34 కోట్లు బోర్డు నిర్వహణకు ఖర్చు చేశారు. బోర్డు దగ్గర ప్రస్తుతం ఉన్న ఫండ్స్తో నాలుగు నెలలకు మించి కేఆర్ఎంబీని నడిపే పరిస్థితి లేదు. బోర్డు ఏర్పడిన తర్వాత మొదటి మూడేండ్లు తెలంగాణ నిధులు ఇవ్వలేదు. రెండేళ్లుగా ఏపీ కూడా నిధులు విడుదల చేయడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బోర్డు రెండో దశ టెలిమెట్రీల ఏర్పాటు, కేఆర్ఎంబీ హెడ్ క్వార్టర్స్ను హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించడం, 2డీ మోడల్ స్టడీస్, బయోమెట్రిక్ సర్వే నిర్వహించడానికి ప్రపోజల్స్ సిద్ధం చేసింది.
ఇప్పుడు వాటి కోసం బోర్డుకు నిధులు అవసరమని అధికారులు చెబుతున్నారు. టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు రూ.5 కోట్లు, 2డీ మోడల్ స్టడీస్, బయోమెట్రిక్ సర్వేకు రూ.1.80 కోట్లు, జ్యూరిస్డిక్షన్కు సంబంధించిన ఎస్టాబ్లిష్ మెంట్కు రూ.కోటి, బోర్డు హెడ్ క్వార్టర్స్ షిఫ్టింగ్కు రూ.91.50 లక్షలు, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, ఇతర ఖర్చులకు రూ.1.98 కోట్లు, జీతాలు, ఇతర ఖర్చులకు రూ.7.30 కోట్లు అవసరమని తెలిపారు. రెండు రాష్ట్రాలు మొదటి దశలో రూ.9 కోట్లు, ఆ తర్వాత మరో రూ.9 కోట్లు విడుదల చేయాలని కోరారు. బోర్డు నిర్వహణకు ఇబ్బంది కరమైన పరిస్థితులు తలెత్తకుండా 2 రాష్ట్రాల ఈఎన్సీలు చర్యలు చేపట్టాలని సూచించారు.