
- సంస్థ లాభాల్లోకి రావడంలో కాకా పాత్ర కీలకం
- నా హయాంలో ఆర్ఎఫ్సీఎల్కు రూ. 10 వేల కోట్లు రుణమాఫీ
- ఎంపీ వంశీకృష్ణ సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంపునకు కృషి చేస్తుండు
- కార్మిక, మైనింగ్శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి
పెద్దపల్లి, వెలుగు: సింగరేణి అభివృద్ధికి తన ఫ్యామిలీ విశేషంగా కృషి చేసిందని, రాష్ట్ర కార్మిక, మైనింగ్శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన దుర్గామాతా మండపంలో మంగళవారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని దుర్గామాతాను వేడుకున్నట్లు తెలిపారు.
‘సింగరేణి లాభాల్లోకి రావడానికి మాజీ కేంద్రమంత్రి, దివంగత నేత కాకా వెంటకస్వామి తీవ్రంగా కృషి చేశారు. సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు ఎన్టీపీసీ నుంచి రూ. 400 కోట్లు ఇప్పించి కాపాడారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు మూతపడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించడానికి రూ. 10 వేల కోట్లు రుణమాఫీ చేయించా. ఆర్ఎఫ్సీఎల్ రీఓపెన్కు తీవ్రంగా కృషి చేశా. ప్రస్తుతం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంపు కోసం పార్లమెంటులో పోరాడుతున్నడు.
అలాగే ఇటీవల రూ. 120 కోట్లు రిలీజ్ అయ్యేలా చేశాడు. నాటి నుంచి నేటి వరకు గడ్డం ఫ్యామిలీ సింగరేణి, కార్మికుల భవిష్యత్ కోసమే పనిచేస్తోంది’ అని మంత్రి స్పష్టం చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉందని, ఒకవైపు ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తూనే, పెద్దపల్లి అభివృద్ధికి రూ. 700 కోట్లు తీసుకొచ్చానన్నారు. పోటీ ప్రపంచానికి అనుగుణంగా సింగరేణిని కూడా వివిధ ఆక్షన్లలో పాల్గొని, గనులు దక్కించుకొని, ఇతర రాష్ట్రాల్లో సంస్థను విస్తరించేందుకు సీఎంను ఒప్పించినట్లు చెప్పారు.
సంస్థ లాభాల్లో కార్మికులకు దసరా బోనస్గా 34 శాతం ఇస్తున్నదని, దీని ద్వారా ప్రతీ కార్మికుడికి దాదాపు రూ. 2 లక్షల వరకు లబ్ధి పొందుతాడన్నారు. గత సర్కార్ హయాంలో కాంట్రాక్టు కార్మికులు అన్యాయానికి గురయ్యారన్నారు. కార్యక్రమంలో దిశ కమిటీ మెంబర్సయ్యద్ సజ్జాద్, బండారు సునీల్, గంగుల సంతోష్, అడ్డగుంట శ్రీనివాస్, కాకా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.