
- 2024–25 లో రూ.3,56,631 కోట్ల విలువైన కొత్త ఆర్డర్లు
- షేరుకి రూ.34 ఫైనల్ డివిడెండ్
న్యూఢిల్లీ: ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్అండ్ టీ) ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్ (క్యూ4) లో రూ.5,497 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) సాధించామని గురువారం ప్రకటించింది. రెవెన్యూ పెరగడంతో కంపెనీ నెట్ ప్రాఫిట్ ఏడాది లెక్కన 25 శాతం వృద్ధి చెందింది. గత ఏడాది మార్చి క్వార్టర్లో ఎల్ అండ్ టీకి రూ.4,396 కోట్ల నికర లాభం వచ్చింది. కార్యకలాపాల నుంచి నుంచి వచ్చిన రెవెన్యూ రూ.67,078.68 కోట్ల నుంచి రూ.74,392.28 కోట్లకు ఎగిసింది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ గ్రూప్ స్థాయిలో రూ.3,56,631 కోట్ల విలువైన ఆర్డర్లను గెలుచుకుంది. ఇది ఏడాది లెక్కన 18 శాతం గ్రోత్కు సమానం.
వీటిలో రూ.2,07,478 కోట్ల ఇంటర్నేషనల్ ఆర్డర్లు ఉన్నాయి. "మేం కంపెనీ చరిత్రలోనే అత్యధిక ఆర్డర్లను 2024–25 లో సాధించాం. దీంతో మా ఆర్డర్ బుక్ రికార్డ్ స్థాయికి చేరుకుంది. రెవెన్యూని పెంచుకుంటూ, డిజిటలైజేషన్ ద్వారా కంపెనీ సమర్ధతను మెరుగుపరుస్తాం" అని ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చెప్పారు. బోర్డ్ 2024–-25 ఆర్థిక సంవత్సరం కోసం ఈక్విటీ షేర్కు రూ.34 ఫైనల్ డివిడెండ్ను సిఫారసు చేసింది. ఎల్ అండ్ టీ షేర్లు గురువారం రూ.3,324 వద్ద ముగిశాయి.