- 30,375 మందిని తొలగిస్తామని ప్రకటించిన 115 కంపెనీలు
- కిందటేడాది 2,62,595 మంది ఇంటికి
- లేఆఫ్స్ బాట పడుతున్న అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫ్లిప్కార్ట్ వంటి పెద్ద కంపెనీలు
న్యూఢిల్లీ : కిందటేడాది టెక్ ఉద్యోగులకు పెద్దగా కలిసి రాలేదు. ఈ ఏడాది కూడా ఇదే ట్రెండ్ కొనసాగేటట్టు కనిపిస్తోంది. ఇప్పటికే చాలా పెద్ద కంపెనీలు ఉద్యోగులను తీసేస్తామని ప్రకటించాయి. కిందటేడాది 2,40,000 కంటే ఎక్కువ మంది టెకీలు తమ జాబ్స్ కోల్పోయారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, నోకియా, యాక్సెంచర్ వంటి గ్లోబల్ కంపెనీలు భారీగా లేఆఫ్స్ చేపట్టాయి. ఇండియాలోనూ బైజూస్, పేటీఎం, షేర్చాట్, డంజో వంటి కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండడం, ఫండింగ్ అందకపోవడం, కరోనా సంక్షోభ సమస్యలు వంటి కారణాలు చూపుతూ కంపెనీలు లేఆఫ్స్ చేపట్టాయి.
కొత్త ఏడాదిలోనూ పరిస్థితులు మెరుగవ్వలేదు. లేఆఫ్స్ డాట్ ఎఫ్వైఐ డేటా ప్రకారం, గ్లోబల్గా కిందటేడాది 1,189 కంపెనీలు 2,62,595 మంది ఉద్యోగులను తొలగించాయి. అంతకు ముందు ఏడాదిలో 1,064 కంపెనీలు తీసేసిన 1,64,969 మంది కంటే ఇది సగం ఎక్కువ. ఈ ఏడాదిలోనూ ఇలాంటి ట్రెండే కనిపిస్తోంది. ఒక్క జనవరిలోనే 115 కంపెనీలు 30,375 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్లు (జాబ్స్ నుంచి తీసేశాయి) ఇచ్చాయి. యూఎస్ లాజిస్టిక్స్ కంపెనీ యూనిటైడ్ పార్సిల్ సర్వీస్ (యూపీఎస్) 12 వేల మందిని తీసేస్తున్నామని ప్రకటించింది.
దీంతో ఒక బిలియన్ డాలర్లు ఆదా చేస్తామని కంపెనీ సీఈఓ కారల్ టామె కామెంట్ చేశారు. జర్మనీ సాఫ్ట్వేర్ కంపెనీ సాప్ కంపెనీలో రీస్ట్రక్చరింగ్ చేపడుతోంది. ఏకంగా 8 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. ఈ కంపెనీ జనరేటివ్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), ఆటోమేషన్ను అడాప్ట్ చేసుకుంటోంది. పేపాల్ తన ఉద్యోగుల్లో 9 శాతం మందిని అంటే 2,500 మందిని తొలగిస్తామని ప్రకటించింది. ఇప్పటికే వివిధ రౌండ్లలో ఉద్యోగులను తీసేసిన గూగుల్, మరో వెయ్యి మందిని తొలగిస్తామని పేర్కొంది. పిక్సల్, ఫిట్బిట్, నెస్ట్, గూగుల్ అసిస్టెంట్ టీమ్స్లోని ఉద్యోగులను తీసేయడానికి సిద్ధమయ్యింది. అంతేకాకుండా యూట్యూబ్ నుంచి వంద మందికి పింక్ స్లిప్లు ఇచ్చింది.
వేలల్లో జాబ్స్ కోత..
కిందటేడాది వివిధ రౌండ్లలో ఉద్యోగులను తొలగించిన మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది కూడా ఇదే ట్రెండ్ కొనసాగిస్తోంది. యాక్టివిజన్ బ్లిజార్డ్, ఎక్స్బాక్స్కు చెందిన 1,900 మంది ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ గేమింగ్ డివిజన్లో ఇది 8 శాతానికి సమానం. ప్రైమ్ వీడియో, ఎంజీఎం స్టూడియో డివిజన్లలోని ఉద్యోగులను తగ్గించుకుంటామని అమెజాన్ ప్రకటించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా కిందటేడాది పెద్ద మొత్తంలో ఉద్యోగులను వదిలేసుకున్నాయి. 500 మందిని తీసేస్తామని ట్విచ్ తాజాగా ప్రకటించగా, 170 మంది తొలగిస్తామని డిస్కార్డ్ పేర్కొంది. డిస్కార్డ్ వర్క్ఫోర్స్లో ఇది 17 శాతానికి సమానం. టిక్టాక్ కూడా 60 మంది ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో ఉంది.
ఇండియాలోనూ అంతే..
గ్లోబల్ కంపెనీలే కాకుండా ఇండియన్ కంపెనీలు కూడా భారీగా లేఆఫ్స్ చేపడుతున్నాయి. స్విగ్గీ 400 మంది ఉద్యోగులను తీసేసింది. కంపెనీ ఉద్యోగుల్లో వీరి వాటా 6 శాతం. వాల్మార్ట్కు చెందిన ఫ్లిప్కార్ట్ 1,000 మందికి పింక్ స్లిప్లు ఇచ్చింది. యాన్యువల్ రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్లో భాగంగా ఉద్యోగులు తీసేస్తున్నామని ప్రకటించింది. రెండు రోజుల కిందట విప్రో కూడా ఈ లిస్టులో జాయిన్ అయ్యింది. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, పెద్ద మొత్తంలో మిడ్ లెవెల్ ఉద్యోగులను విప్రో వదిలేసుకుంటోంది. చాలా కంపెనీలు ‘రీస్ట్రక్చరింగ్’, ‘సమర్థతను పెంచడం’, ‘సస్టయినబిలిటీపై ఫోకస్ పెట్టడం’, ‘ఎక్కువ మందిని హైర్ చేసుకున్నాం’ వంటి కారణాలను చెబుతున్నాయి.
కరోనా టైమ్లో ఆన్లైన్ కంపెనీలు ఎక్కువగా లాభపడ్డాయి. కస్టమర్లు ఎక్కువ టైమ్ ఆన్లైన్లో గడపడంతో వీటి రెవెన్యూ పెరిగింది. అందువలన భారీగా ఉద్యోగులను హైర్ చేసుకున్నాయి. కానీ, ప్రస్తుతం పరిస్థితులు తిరిగి సాధారణ స్థాయికి చేరుకున్నాయి. దీంతో చాలా ఆన్లైన్ కంపెనీలు తమ ఉద్యోగులను తీసేయాల్సి వస్తోంది. అంతేకాకుండా ఏఐ పాపులర్ అవ్వడంతో ఆర్గనైజేషన్లకు కొన్ని జాబ్ రోల్స్ అవసరం లేకుండా పోతోంది. ఏఐ వలన అనుకున్నదాని కంటే ఎక్కువ వర్క్ జరుగుతోందని, అందుకే 1,000 మందిని తీసేస్తున్నామని పేటీఎం సీఈఓ విజయ్శేఖర్ శర్మ కామెంట్ చేయడం గమనించాలి. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో వీరి వాటా 15 శాతం. ఇంకా ఏడాది స్టార్టింగ్లోనే ఉన్నాం. మరిన్ని టెక్ కంపెనీలు భారీగా లేఆఫ్స్ చేపట్టే అవకాశం
కనిపిస్తోంది.
గ్లోబల్గా ఈ ఏడాదిలో భారీ లేఆఫ్స్ చేపడుతున్న కంపెనీలు..
- యూపీఎస్ 12,000
- సాప్ 8,000
- సేల్స్ఫోర్స్ 7,000
- గూగుల్ 1,000
- మైక్రోసాఫ్ట్ 1,900
- యూనిటీ 1,800
- వేఫెయిర్ 1,650
- ఫ్లిప్కార్ట్ 1,000