బెంగళూరు : 68 ఏళ్ల మహిళను చిరుత పులి అత్యంత దారుణంగా చంపేసింది. ఈ విషాద సంఘటన బెంగళూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. కొట్టగణహల్లి గ్రామానికి చెందిన గంగమ్మ (68)ఈ ఉదయం వాకింగ్ కు వెళ్లింది. ఈ సమయంలో ఆమెపై చిరుత దాడి చేసి పారి పోయింది. దీంతో బామ్మ గట్టిగా అరుస్తూ అక్కడే చనిపోయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని.. మహిళ మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం నీలమంగళ ఆస్పత్రికి తరలించారు. చిరుత ఆచూకీ కోసం అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
బెంగళూరుకు సమీపంలో చిరుత గత కొద్ది రోజుల నుంచి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. బెంగళూరు శివారులోని కదిరైహన పాల్యలో మూడేళ్ల బాలుడు హేమంత్పై కూడా చిరుత దాడి చేసింది. దీంతో హేమంత్ మృతి చెందాడు. ఈ ఘటన మే 9న చోటు చేసుకుంది. ఈ ఘటన మరువకముందే తాజాగా 68 ఏళ్ల మహిళను చిరుత చంపేసింది. అయితే హేమంత్ను చంపేసిన చిరుతను పట్టుకుని అడవిలో వదిలేశామని అధికారులు తెలిపారు. మళ్లీ అదే చిరుత జనవాసాల్లోకి వచ్చి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.