రావణుడ్ని రాముడు ఓడించినట్లే.. కరోనాపై మనం గెలవాలి

రావణుడ్ని రాముడు ఓడించినట్లే.. కరోనాపై మనం గెలవాలి

లండన్: రానున్న దీపావళిని పురస్కరించుకుని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్‌‌పై పోరులో దీపావళి స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ‘మనం మున్ముందు భారీ సవాళ్లను ఎదుర్కోబోతున్నాం. దేశ ప్రజలపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. కరోనా మహమ్మారిని మనం అధిగమించగలమని నమ్ముతున్నా. చీకటిపై వెలుతురు, చెడు మీద మంచి, అజ్ఞానం పై జ్ఞానానిదే అంతిమ విజయమని బోధించే దీపావళి స్ఫూర్తితో మనం కరోనాపై పోరాడాలి. రాక్షసుడైన రావణుడిపై గెలుపు తర్వాత భగవాన్ రాముడు, సీతమ్మతో కలసి తమ ఇంటికి వెళ్లారు. ఈ దారిలో వారికి లక్షల వెలుగు దివ్వెలు ఆహ్వానం పలికాయి. ఇదే విధంగా మనమూ మన మార్గాన్ని కనుగొనాలి. మహమ్మారి వల్ల కమ్ముకున్న చీకట్లను మనం విజయవంతంగా అధిగమించాలి’ అని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు.