- వీరిలో మల్లు రవి, సురేశ్ షెట్కార్, నీలం మధు, డీకే అరుణ, రఘునందన్
నెట్వర్క్, వెలుగు: లోక్సభ ఎన్నికల నామినేషన్లు గురువారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు మొత్తం 42 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థులు మల్లు రవి, సురేశ్ షెట్కార్, నీలం మధు, బీజేపీ క్యాండిడేట్లు డీకే అరుణ, రఘునందన్రావు, పోతుగంటి భరత్ప్రసాద్, ఈటల రాజేందర్, శానంపూడి సైదిరెడ్డి ఉన్నారు. నాగర్కర్నూల్ స్థానానికి కాంగ్రెస్అభ్యర్థి మల్లు రవి నామినేషన్ దాఖలు చేశారు.
ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, వంశీకృష్ణ, నాగర్కర్నూల్ ఇన్చార్జ్ హబీబ్, తన కుమారుడు సిద్ధార్థ్ తో కలిసి రిటర్నింగ్ ఆఫీసర్ ఉదయ్కుమార్కు మల్లు రవి నామినేషన్ పేపర్లు అందజేశారు. మంచి ముహూర్తం ఉన్నందున ఒక సెట్నామినేషన్ దాఖలు చేశానని, ఈ నెల 23న మరో సెట్ వేస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి హాజరవుతారని తెలిపారు. జహీరాబాద్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ తరఫున పార్టీ నాయకులు నామినేషన్ దాఖలు చేశారు.
రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతికి నామినేషన్ పత్రాలను అందజేశారు. మెదక్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరఫున ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ నామినేషన్ వేశారు. కాగా, మెదక్ స్థానానికి తెలంగాణ ప్రజాశక్తి పార్టీ తరఫున దొడ్ల వెంకటేశం, ఇండిపెండెంట్ అభ్యర్థిగా చిక్కుపల్లి నవీన్ కుమార్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇచ్చోడకు చెందిన సుభాశ్ రాథోడ్, ఆధార్ పార్టీ అభ్యర్థిగా ఖమ్మం జిల్లాకు చెందిన మాలోత్ శ్యామ్ లాల్ నాయక్ నామినేషన్లు వేశారు.
బీజేపీ నుంచి ముగ్గురు..
మహబూబ్నగర్ స్థానానికి బీజేపీ క్యాండిడేట్ డీకే అరుణ రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. రిట ర్నింగ్ ఆఫీసర్ రవి నాయక్కు ఆమె పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్సీ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. నామినేషన్ వేయడానికి ముందు కాటన్ మిల్లు వద్ద ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో అరుణ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి కొత్త కలెక్టరేట్వరకు బైక్ర్యాలీ నిర్వహించారు.
మహబూబ్నగర్ నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా మహ్మద్ ఇంతియాజ్ అహ్మద్ కూడా నామినేషన్ వేశారు. మెదక్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గోదావరి, మోహన్రెడ్డి, నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్కుమార్తో కలిసి ఆయన నామినేషన్వేశారు. అంతకుముందు బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఇంట్లో తన తల్లిదండ్రులు భగవంతరావు, భారతి కాళ్లకు దండం పెట్టి రఘునందన్ రావు కలెక్టరేట్కు బయలుదేరారు. నాగర్కర్నూల్ స్థానానికి బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీ రాములు, ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్జక్కా రఘునందన్ రెడ్డి పాల్గొన్నారు.