నీరవ్ బెయిల్ పిటిషన్ ను మళ్లీ నిరాకరించిన లండన్ కోర్టు

నీరవ్ బెయిల్ పిటిషన్ ను మళ్లీ నిరాకరించిన లండన్ కోర్టు

వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. లండన్ కోర్టు అతని అభ్యర్థనను తిరస్కరించింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్  పిటిషన్ ను కోర్టు తిరస్కరించడం ఇది ఏడో సారి. పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల మేర మోసగించి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ ప్రస్తుతం యూకే జైల్లో ఉన్నాడు.

ఈ నెల మొదట్లో జరిగిన విచారణలో నీరవ్ రిమాండ్ ను యూకే కోర్టు మరింత పొడిగించింది. తదుపరి విచారణ నవంబరు 3న జరగనుండగా, అప్పటివరకు రిమాండ్ విధిస్తున్నట్టు తెలిపింది.  గతనెలలో జరిగిన విచారణలో నీరవ్ మోడీ న్యాయవాది కోర్టుకు పలు అంశాలు నివేదించారు. రాజకీయపరమైన ఒత్తిళ్ల కారణంగా భారత్ లో విచారణ సజావుగా సాగే అవకాశాలు లేవని, పైగా అక్కడి జైళ్లలో సరైన వైద్య సదుపాయాలు లేని పరిస్థితుల కారణంగా తన క్లయింటు ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలున్నాయని కోర్టును ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు.

49 ఏళ్ల నీరవ్ ను భారత్ తమకు అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరింది. నవంబరు 3న జరిగే విచారణలో నీరవ్ ను.. భారత్ కు అప్పగించడంపై వాదనలు జరగనున్నాయి. లండన్ జైల్లో ఉన్న నీరవ్ ఈ విచారణకు వీడియో లింక్ ద్వారా హాజరుకానున్నారు.