న్యూఢిల్లీ:మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును సవాలు చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై రెండోరోజైన సోమవారం కూడా వాదనలు జరిగాయి. సీఎం ఫడ్నవీస్కు మెజార్టీ ఎమ్మెల్యేల బలంలేదని, గవర్నర్ ఇచ్చిన 14 రోజుల గడువు కంటే ముందే ఫ్లోర్ టెస్టుకు ఆదేశించాలని కూటమి తరఫు అడ్వొకేట్లు కోర్టును కోరారు. బీజేపీకి మద్దతిస్తున్నట్లు ఎన్సీపీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లెటర్ను ఆ పార్టీ ఎల్పీ లీడర్ అజిత్ పవార్ గవర్నర్కు ఇచ్చారని, ఆ తర్వాతే గవర్నర్ తన విచక్షణ ప్రకారం ఫడ్నవీస్తో సీఎంగా ప్రమాణం చేయించారని కేంద్రం, మహారాష్ట్ర బీజేపీ తరఫు అడ్వొకేట్లు తెలిపారు. రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా బెంచ్ తీర్పును మంగళవారానికి రిజర్వ్ చేసింది. గతంలో ఇలాంటి కేసుల్లో ఫ్లోర్ టెస్టుకు సుప్రీం ఆదేశించిందంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా కామెంట్ చేసిన నేపథ్యంలో ఇవాళ ఉదయం 10:30కు వెలువడనున్న తీర్పు.. ఫడ్నవీస్ను బలం నిరూపించుకోవాలని ఆదేశించేలా ఉండొచ్చని న్యాయనిపుణులు భావిస్తున్నారు.
ఎన్సీపీ సపోర్టుతోనే సర్కారు ఏర్పాటైంది: కేంద్రం, బీజేపీ
బీజేపీకి మద్దతిస్తున్నట్లు ఎన్సీపీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను ఆ పార్టీ ఎల్పీ లీడర్ అజిత్ పవార్ గవర్నర్కు ఇచ్చారని, ఆ తర్వాతే ఫడ్నవిస్ మెజార్టీ క్లెయిమ్ చేసుకున్నారని, మద్దతు లేఖల ఆధారంగానే గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. వాటికి సంబంధించిన రెండు లెటర్లను బెంచ్ముందుంచారు. ఎన్సీపీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ హోదాలోనే అజిత్ పవార్ బీజేపీకి సపోర్ట్ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారని, ఆ మేరకే ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లెటర్ను గవర్నర్కు ఇచ్చారని అజిత్ తరఫు న్యాయవాది మనీందర్ సింగ్ తెలిపారు. పవార్ ఫ్యామిలీ గొడవలతో తమకు సంబంధం లేదని, అజిత్ పవార్ ఇచ్చిన లెటర్లో ఎమ్మెల్యేల సంతకాలపై ఎవరికీ అనుమానాలు లేవని, అవి ఫోర్జరీ చేశారని ఎన్సీపీ నేతలు కూడా ఆరోపించడంలేదని మహారాష్ట్ర బీజేపీ తరఫున వాదించిన సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. గవర్నర్ నిర్ణయాల్లో కలుగజేసుకునే అధికారం కోర్టుకు లేదని, ఫ్లోర్ టెస్టుకు 14 రోజుల టైమ్ ఇవ్వడం సరైందేనని, స్పీకర్ ఎన్నికత తర్వాతే బలపరీక్ష నిర్వహించాలని రోహత్గీ అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా కలగజేసుకుంటూ.. గతంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించి ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు 24 గంటల్లో లేదా 48 గంటల్లో బలం నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
బలముంటే బీజేపీకి భయమెందుకు?: కూటమి
బీజేపీ చాలా మోసపూరితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిందని, ఫడ్నవీస్కు మద్దతిస్తున్నామని ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా చెప్పలేదని ఎన్సీపీ, కాంగ్రెస్ తరఫు అడ్వొకేట్ అభిషేక్ సింఘ్వీ వాదించారు. ‘‘గవర్నర్కు అజిత్ పవార్ ఇచ్చింది.. 54 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితా మాత్రమే. అది మద్దతు లెటర్ కానేకాదు. మెజార్టీ ఎమ్మెల్యేలు మహా వికాస్ కూటమి వైపే ఉన్నారు. అసెంబ్లీలో బలం నిరూపించుకోడానికి కూటమి రెడీ ఉంది. బీజేపీ కూడా తనకు బలముందని చెప్పుకుంటున్నది. కాబట్టి 24 గంటల్లోపు ఫ్లోర్ టెస్టుకు ఆదేశిస్తే ఎవరిబలం ఏంతుదో తేలిపోతుంది”అని సింఘ్వీ తెలిపారు. శివసేన తరఫున కపిల్ సిబాల్ వాదన వినిపిస్తూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడొద్దన్న ఉద్దేశంతోనే హడావుడిగా తెల్లవారుజామున రాష్ట్రపతి పాలన ఎత్తేసి, ఉదయానికల్లా ఫడ్నవీస్తో సీఎంగా ప్రమాణం చేయించారని ఆరోపించారు. అజిత్ పవార్ ఎన్సీపీ ఎల్పీ లీడర్ కాదని తెలిపే అఫిడవిట్లను సిబాల్ కోర్టుకు సమర్పించారు.