న్యూఢిల్లీ: మహారాష్ట్ర పొలిటికల్ క్రైసిస్ సోమవారంపార్లమెంట్లో దుమారం లేపింది. మహారాష్ట్ర అంశంపై చర్చ జరగాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నేతలు రెండు సభల్లో పట్టుబట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు అంశం కోర్టులో విచారణ జరుగుతుందని, దానిపై ఇప్పుడు చర్చించలేమని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తెలిపారు. అయినా విపక్ష నేతలు ఆందోళన ఆపకపోవడంతో మార్షల్స్ రంగంలోకి దిగి ఆందోళన చేస్తున్న సభ్యులను బలవంతంగా బయటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో మార్షల్స్ తమపై చేయిచేసుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మహిళా ఎంపీలు ఆరోపించారు. సభ మంగళవారానికి వాయిదాపడ్డ తర్వాత పార్లమెంట్ ఆవరణలోని మహాత్ముడి విగ్రహం దగ్గర కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతోపాటు ముఖ్యనేతలు ‘డెమోక్రసీని హత్య చేయడం ఆపండి’ అంటూ ఫ్లెక్సి ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కాంగ్రెస్, లెఫ్ట్, డీఎంకే సభ్యుల ఆందోళనల నేపథ్యంలో డిప్యూటీ చైర్మన్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.
ఉదయం లోక్సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ ఎంపీలు లేచి, మహారాష్ట్రలో ప్రజస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలుచేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ‘మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాక.. ఇక్కడ సభలో ప్రశ్నలు అడిగి మాత్రం ఉపయోగమేముంది. ఈరోజు(సోమవారం) క్వశ్చన్ అవర్లో ప్రశ్నలడిగే ప్రశ్నేలేదు’ అని రాహుల్ గాంధీ అన్నారు. పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో కాంగ్రెస్ సభ్యులు హిబి ఎడెన్, టీఎన్ ప్రథాపన్లను స్పీకర్ ఓంబిర్లా సస్పెండ్ చేశారు. వారిని బయటికి పంపించాలంటూ మార్షల్స్ను ఆదేశించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనలను మరింత తీవ్రంచేశారు. సభ నడిచే పరిస్థితి లేకపోవడంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. ఒకవైపు కాంగ్రెస్ సభ్యుల ఆందోళన కొనసాగుతుండగానే ప్రభుత్వం సభలో నాలుగు బిల్లులను ప్రవేశపెట్టింది. ఎస్పీజీ యాక్ట్ సవరణ బిల్లు కూడా ఇందులో ఉంది. మహారాష్ట్ర అంశంపై లోక్సభలో కాంగ్రెస్ ఎంపీల తీరుకు వెల్లోకి దూసుకురావడం కరెక్ట్ కాదని స్పీకర్ ఓంబిర్లా అన్నారు. సభలో జరిగిన సంఘటనలతో హర్ట్ అయ్యానని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీల తీరు అభ్యంతరకరమని, సహించలేనిదని స్పీకర్ అన్నారు. సభ కార్యకలాపాలను అడ్డుకున్నందుకు ఎంపీలు హిబి ఎడెన్, టీఎన్ ప్రతాపన్లను స్పీకర్ ఐదేళ్ల పాటు సస్పెండ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.