మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: అధికారులు సమన్వయంతో పని చేసి వడ్ల కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలని పాలమూరు కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో వడ్ల కొనుగోలుపై కేంద్రాల ఇన్చార్జీలు, ఐకేపీ ఏపీఎంలు, సీసీలు, పీఏసీఎస్ మానిటరింగ్ ఆఫీసర్లు, కార్యదర్శులు, పాయింట్ ఇన్చార్జీలు, ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు, రైస్ మిల్లర్ల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌలతులు కల్పించాలని ఆదేశించారు. త్వరలో జిల్లాకు 45 ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు వస్తాయని తెలిపారు. రైతులు వడ్లు ఆరబోసి తాలు లేకుండా, నిర్ణీత తేమ శాతం ఉండేలా చూసుకోవాలన్నారు.
దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. వడ్లు తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు పాల్పడినా, నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, డీఆర్డీవో నర్సింహులు, జిల్లా సహకార అధికారి శంకరాచారి, పౌర సరఫరాల సంస్థ డీఎం రవి నాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్, డీఏవో వెంకటేశ్, హార్టికల్చర్ ఆఫీసర్ వేణుగోపాల్, మార్కెటింగ్ అధికారి బాలమణి, సహకార ఆడిట్ అధికారి టైటస్ పాల్ పాల్గొన్నారు.
మెరుగైన సేవలు అందించాలి
మహబూబ్ నగర్ అర్బన్: ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. శుక్రవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి డాక్టర్లతో సమావేశం నిర్వహించి, వివిధ అంశాలను రివ్యూ చేశారు. ఆసుపత్రిలో ఇటీవల జరిగిన ఘటనలు, దొంగతనాలు,ఎస్పీఎఫ్ సిబ్బంది పని తీరు, రోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం తదితర అంశాలపై చర్చించారు. హాస్పిటల్ లో ఇటువంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రంగా అజ్మీరా
పాల్గొన్నారు.
