- ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు
మహబూబ్నగర్ అర్బన్, వెలుగు: సైబర్ నేరాలపై పట్టు సాధించిన ఓ ముఠా ఫేక్ ఫైనాన్స్ సైట్ ద్వారా పలువురిని మోసం చేసి రూ.3 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను మహబూబ్నగర్ ఎస్పీ డి.జానకి శనివారం వెల్లడించారు. మహబూబ్నగర్ రూరల్ మండలం తువ్వగడ్డతండాకు చెందిన జర్పుల సురేందర్, కాట్రావత్ హనుమంతు కోల్కతాలో సైబర్ నేరగాళ్ల వద్ద ట్రైనింగ్ తీసుకున్నారు.
తర్వాత ఇదే తండాకు చెందిన మరికొందరు యువకులకు శిక్షణనిచ్చి ముఠాగా తయారుచేశారు. ఈ ముఠా ఫేస్ బుక్లో 'ధనా ఫైనాన్స్' పేరుతో ప్రచారం చేసింది. ఇది నమ్మిన నగరంలోని హనుమాన్నగర్ కు చెందిన వాకిటి వంశీకృష్ణ తన పాన్ కార్డు, ఆధార్ కార్డును ధనా ఫైనాన్స్ సైట్లో అప్లోడ్ చేశాడు. ఆ తరువాత నిందితులు లోన్ సాంక్షన్ ఫేక్ లెటర్ ను వంశీకృష్ణకు పంపించారు.
లోన్ మంజూరైందని నమ్మించి ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్, జీఎస్టీ, టీడీఎస్, మొదటి ఈఎంఐ పేరుతో రూ.75 వేలు వసూలు చేశారు. తర్వాత నిందితులు అందుబాటులో లేకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి.. జర్పుల సురేందర్, కాట్రావత్ హనుమంతు, వడ్త్యా రాజు, వత్స్య భాస్కర్, కాట్రావత్ నరేశ్, రాత్లావత్ సంతోశ్, రాత్లావత్ సోమలను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు.
వీరు ఇప్పటి వరకు దాదాపు వెయ్యి మందిని ఈ తరహాలో మోసం చేసి రూ.3 కోట్లు కాజేసినట్లు ఎస్పీ తెలిపారు. వీరి వద్ద ల్యాప్ టాప్, ఆటో, బైక్, రూ.1.50 లక్షలు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
