చిన్నారులపై లైంగిక వేధింపులు.. థానే జిల్లాలో మిన్నంటిన నిరసన

చిన్నారులపై లైంగిక వేధింపులు.. థానే జిల్లాలో  మిన్నంటిన నిరసన
  • జనం ఆందోళనతో అట్టుడికిన థానే జిల్లా బద్లాపూర్​
  •     రైల్వే స్టేషన్​లో స్టూడెంట్స్​ తల్లిదండ్రుల, స్థానికుల ధర్నా
  •     ట్రాక్​లపైకి చేరుకొని రైళ్ల అడ్డగింత.. మద్దతుగా దుకాణాల బంద్​
  •     దోషులను ఉరితీయాలని డిమాండ్.. ప్లకార్డుల ప్రదర్శన
  •     ప్రిన్సిపాల్ ​సస్పెండ్​.. మరో ఇద్దరిని తొలగించిన స్కూల్​ యాజమాన్యం
  •     ఫాస్ట్​ ట్రాక్​ కోర్టులో కేసు విచారణ: సీఎం ఏక్​నాథ్​ షిండే

థానె : మహారాష్ట్రలోని థానె జిల్లా బద్లాపూర్​లోని ఓ ప్రైవేట్ స్కూల్​లో ఇద్దరు చిన్నారులపై స్వీపర్​ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్టూడెంట్స్​ తల్లిదండ్రులతోపాటు స్థానికులు, యువత పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. స్కూల్ టాయిలెట్‌‌‌‌లో నాలుగేండ్ల వయసున్న ఇద్దరు చిన్నారులను స్వీపర్(23) లైంగికంగా వేధించాడు. ఆగస్టు 16న ఈ ఘటన జరగ్గా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మరుసటిరోజు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు అయితే, ఈ ఘటనపై మంగళవారం ఒక్కసారిగా నిరసనలు వెల్లువెత్తాయి. స్కూల్​స్టూడెంట్స్​తల్లిదండ్రులతోపాటు స్థానికులు, యువత బద్లాపూర్ రైల్వేస్టేషన్​లో ఆందోళనకు దిగారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్లదాడికి దిగారు. అందరూ పట్టాలమీదకి రావడంతో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దోషులను ఉరితీయాలని వారు డిమాండ్​ చేశారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ కదంతొక్కారు.  అంతకుముందు కొందరు పాఠశాలపై దాడి చేశారు. స్కూల్​ గేటు, డోర్లు, కిటికీలు, అద్దాలు పగులగొట్టారు. బద్లాపూర్ బంద్​కు పలు సంస్థలు పిలుపునిచ్చాయి.

ముగ్గురిపై స్కూల్​ మేనేజ్​మెంట్ ​చర్యలు

ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ స్కూల్​ప్రిన్సిపాల్​ను సస్పెండ్​ చేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. క్లాస్​టీచర్, మరో సహాయకురాలిని తొలగించినట్టు వెల్లడించింది. అలాగే, ఈ ఘటనపై యాజమాన్యం క్షమాపణలు కూడా చెప్పింది. స్కూల్​ ఆవరణలో నిఘాను పటిష్టం చేసినట్టు తెలిపింది. 

ఫిర్యాదు తీసుకునేందుకు 11 గంటలా?

బాధిత స్టూడెంట్స్​ పేరెంట్స్​ ఫిర్యాదు చేసేందుకు వస్తే బద్లాపూర్ ​పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత (కాంగ్రెస్) విజయ్​ వాడెట్టివార్​ మండిపడ్డారు. వారిని 11 గంటలపాటు స్టేషన్​లోనే కూర్చోబెట్టారని ఆరోపించారు. దీంతో బద్లాపూర్​ పోలీస్​ స్టేషన్​ ఇన్​చార్జిని  సస్పెండ్​ చేసినట్టు ఉన్నతాధికారులు చెప్పారు. కాగా, బాలికలపై లైంగిక వేధింపులు జరిగిన పాఠశాల యాజమాన్యంతో బీజేపీ నేతలకు లింక్​ ఉన్నదని శివసేన (యూబీటీ) చీఫ్​ ఉద్దవ్​ ఠాక్రేఆరోపించారు.

ఫాస్ట్​ ట్రాక్​ విచారణ: సీఎం

ఈ ఘటనపై ఫాస్ట్​ట్రాక్ విచారణ జరిపిస్తామని మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్​ షిండే వెల్లడించారు. అలాగే, స్పెషల్ పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ను అపాయింట్​ చేస్తామని చెప్పారు. ఈ ఘటనలో అరెస్టయిన నిందితుడిపై రేప్​ కేసు పెట్టాలని పోలీసులను ఆదేశించానని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు సంయమనం పాటించాలని ఆయన కోరారు.