వాహనదారులకు మహీంద్రా భారీ ఆఫర్

వాహనదారులకు మహీంద్రా  భారీ ఆఫర్

మార్కెట్ లో మరింత పట్టు సాధించేందుకు..మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ సరికొత్త ప్రణాళికలు అమలు చేస్తోంది. మహీంద్రా గ్రూపు అనుబంధ సంస్థ మహీంద్రా ట్రక్ అండ్ బస్ (MTB) తాజాగా ఆసక్తికర ప్రకటన చేసింది. తమ BS6 ట్రక్కుల మోడల్స్ లో ఏ ఒక్క మోడల్ అయినా అత్యధిక మైలేజీ ఇవ్వకపోతే దాన్ని వాపసు తీసుకుంటామని స్పష్టం చేసింది. తమ BS6 శ్రేణిలో భారీ, మధ్యస్థ, తేలికపాటి వాహనాలు ప్రత్యర్థి వాహనాల కంటే మైలేజీ తక్కువ ఇస్తే, వినియోగదారులు ఆ వాహనాలను వెనక్కి ఇచ్చేయొచ్చని వివరించింది. బ్లేజో ఎక్స్ హెచ్ సీవీ, ఫ్యూరియో ఐసీవీ, ఫ్యూరియో 7, జేయో మోడల్ వాహనాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని MTB లేటెస్ట్  ప్రకటనలో తెలిపింది.

ఇంధన ధరలు పెరిగిపోతున్న ప్రస్తుత సమయంలో వినియోగదారుల పరంగా చూస్తే ఇది సరైన పథకం అని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ సెక్టార్ సీఈవో వీజయ్ నక్రా తెలిపారు. వినియోగదారుల పరంగా చూస్తే, ఈ స్కీమ్ ప్రవేశపెట్టడానికి ఇదే సరైన టైం అని చెప్పారు. మహీంద్రా సంస్థ సాంకేతిక సామర్థ్యంపై వినియోగదారుల్లో నమ్మకాన్ని మరింత పెంపుదల చేసేందుకు తాజా స్కీమ్ ప్రకటనే నిదర్శనమన్నారు. రవాణా వాహన శ్రేణిలో అత్యుత్తమ ప్రమాణాలు ఏర్పాటు చేయడంలో మహీంద్రా నిబద్ధత విశ్వసనీయమైందన్నారు నక్రా.

మైలేజీ రాకపోతే ట్రక్కును వెనక్కి ఇవ్వండి అనే ఈ స్కీమ్ ను మహీంద్రా 2016లో తమ బ్లేజో ఎక్స్ హెచ్ సీవీ ట్రక్కులకు అమలు చేసింది. ఆ సమయంలో 33 వేల బ్లేజో ట్రక్కులు అమ్ముడు కాగా.. ఏ ఒక్కటి వెనక్కి రాలేదని మహీంద్రా సంస్థ ప్రకటించింది.

మరిన్ని వార్తల కోసం...

యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో 12 మందికి కరోనా