ఎవరికైనా విషెస్ చెప్పాలంటే ఫొటోస్ ఎడిట్ చేసి, కార్డ్లు డిజైన్ చేయాలి. కానీ, డిజైన్ చేసేంత టైం అందరికీ ఉండదు. అలాంటప్పుడు ఆన్లైన్ డిజైనింగ్ టూల్స్ వాడొచ్చు. కాకపోతే వాటిలో మనకు నచ్చినట్లు డిజైన్ టెంప్లేట్లో మార్పులు చేసే వీలుండదు. ఏవో చిన్న చిన్న మార్పులు మాత్రమే చేసుకోగలం. అయితే, మైక్రోసాఫ్ట్ కంపెనీ కొత్త డిజైనర్ టూల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. దీన్ని యూజర్లు ఉచితంగా వాడుకోవచ్చు. పోయినేడాదే దీని గురించి ప్రకటించినా, లేటెస్ట్గా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పోస్టర్స్, ప్రజెంటేషన్స్, డిజిటల్ పోస్ట్ కార్డ్స్, ఇన్విటేషన్లు, సోషల్ మీడియా పోస్టర్లు, గ్రాఫిక్ డిజైన్స్, ఇమేజ్ క్రియేషన్ వంటివి ఈజీగా చేయొచ్చు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ డిజైనరల్ టూల్ వెబ్ వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది.
ఇలా వాడాలి
బ్రౌజర్లో మైక్రోసాఫ్ట్ డిజైనర్ అని టైప్ చేస్తే టూల్ వెబ్ పేజ్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే కుడి వైపు పైభాగంలో ఫ్రీ వెర్షన్ ట్రై చేయమని అడుగుతుంది. మైక్రోసాఫ్ట్ అకౌంట్ వివరాలు నమోదు చేసి లాగిన్ అవ్వాలి. తర్వాత క్రియేట్ చేయాలనుకుంటున్న డిజిటల్ కార్డ్కి సంబంధించిన టెక్స్ట్ను రాసి, సెర్చ్చేయాలి. అప్పుడు దానికి సంబంధించిన ఫొటోలు కింద కనిపిస్తాయి. వాటిలో నచ్చినదాన్ని సెలక్ట్ చేసుకుని, బ్యాక్గ్రౌండ్ కలర్, ఫొటో, టెక్స్ట్లో ఏవైనా మార్పులు చేయొచ్చు. లేదా వీటికోసం పక్కనే ఐడియాస్ పేరుతో డిజైనర్ కొన్ని సూచనలిస్తుంది. వాటిని వాడొచ్చు. అలానే వాటి సాయంతో ఇమేజ్ డిజైన్ చేసి, దాన్ని డైరెక్ట్గా సోషల్ మీడియాలో షేర్ చేయొచ్చు. త్వరలో ఇందులోనే మరిన్ని ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొస్తుందట మైక్రోసాఫ్ట్.
గూగుల్ డ్రైవ్తో స్కాన్
ఇంతకుముందు ఏదైనా డాక్యుమెంట్ స్కాన్ చేయాలంటే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్లేవాళ్లు. కానీ, ఇప్పుడు స్మార్ట్ ఫోన్తోనే స్కాన్ చేస్తున్నారు. అయితే, స్కాన్ చేయడానికి స్పెషల్ ఫీచర్స్, యాప్స్ ఏం అవసరం లేదు. గూగుల్ డ్రైవ్తో కూడా స్కాన్ చేయొచ్చు.
అదెలాగంటే...
ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ డ్రైవ్ యాప్ను ఓపెన్ చేయాలి. కింద కుడి వైపున ఉన్న ప్లస్ గుర్తును ట్యాప్ చేయాలి. అప్పుడు మెనూలో కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిల్లో స్కాన్ ఆప్షన్ని సెలక్ట్ చేయాలి. దాంతో కెమెరా దానంతట అదే ఆన్ అవుతుంది. తర్వాత కెమెరా అడిగిన వాటికి (Allow) అనుమతి ఇవ్వాలి. డాక్యుమెంట్ పూర్తిగా ఫ్రేమ్లో కనిపించేలా సెట్ చేయాలి. తర్వాత ఫొటో తీయాలి. అప్పుడు ఆ ఫొటోని సేవ్ చేయడానికి కన్ఫర్మ్ (confirm) చేయాలి. అందుకోసం చెక్ మార్క్ మీద ట్యాప్ చేయాలి. దాంతో గూగుల్ డ్రైవ్ దానంతట అదే క్రాప్ చేసి, లైట్ను అడ్జస్ట్ చేసుకుంటుంది. అవసరమైతే మాన్యువల్గా అడ్జస్ట్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేయాలి. ఫైల్కి పేరు పెట్టి, సేవ్ చేసుకునే ఫోల్డర్ను సెలక్ట్ చేయాలి. అప్పుడది పీడీఎఫ్ రూపంలో సేవ్ అవుతుంది.
స్పామ్ కాల్స్ ఇక రావు!
స్పామ్ కాల్స్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఆ కాల్స్ గురించి కాస్త అవగాహన ఉన్న కొందరే వాటి నుంచి బయటపడతారు. కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆ ప్రాబ్లమ్కి చెక్ పెట్టొచ్చు. అందుకోసం టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. దాంతో మొబైల్ యూజర్లు సేఫ్గా ఉండొచ్చు అంటోంది.
మామూలుగా ఒక వ్యక్తి కాంటాక్ట్ లిస్ట్లో లేని నంబర్ నుంచి ఫోన్ వచ్చినా, వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తారు. అలాంటప్పుడు అవతలి వాళ్లు ఏదైనా బ్యాంక్ పేరు చెప్పి, లోన్, క్రెడిట్ కార్డ్ ఇస్తాం అంటారు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ టైం అయిపోయింది అని చెప్తుంటారు. అది విన్నాక, స్పామ్ కాల్ అని తెలుస్తుంది. మరి ఈ కాల్స్ నుంచి బయటపడాలంటే ట్రాయ్ పెట్టిన రూల్ పాటించాలి. దాన్ని మే 1, 2023 తేదీన అమల్లోకి తీసుకొచ్చారు.
పనితీరు ఇలా..
ఈ రూల్ ప్రకారం టెలికాం నెట్వర్క్ ఆపరేటర్లు (ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్) ఫోన్ కాల్స్, మెసేజ్ సర్వీస్ల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బేస్డ్ స్పామ్ ఫిల్టర్స్ వాడాలి. ఈ ఫిల్టర్స్ వేర్వేరు వ్యక్తులు లేదా కంపెనీల నుంచి వచ్చే నకిలీ ఫోన్ కాల్స్, మెసేజ్లను గుర్తించి అడ్డుకుంటాయి. దాంతో యూజర్లు స్పామ్ కాల్స్ నుంచి సేఫ్గా ఉంటారు. ప్రస్తుతం ఎయిర్టెల్, జియో కంపెనీలు ఆ సేవలు నడుస్తాయి.