ఊళ్లలో వ్యాపారులే టార్గెట్గా సరఫరా
నకిలీ నోట్లను సరఫరా చేస్తున్న రెండు ముఠాల అరెస్ట్
రూ.17 లక్షల విలువైన ఫేక్ కరెన్సీ సీజ్
తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తుడు కూడా అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: నకిలీ నోట్లు తయారు చేయడమెలాగో యూట్యూబ్లో చూశారు. ఓ ఆన్లైన్ సైట్లో సెకండ్ హ్యాండ్ కలర్ ప్రింటర్లు, స్కానర్లు కొన్నారు. రూ.100, రూ.200 నోట్లను ప్రింట్ చేశారు. ఊళ్లలోని వ్యాపారులే టార్గెట్గా వాటిని చెలామణీ చేశారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కబెడుతున్నారు. మరో కేసులో హైదరాబాద్లో రూ.500, రూ.2000 నకిలీ నోట్లను చెలామణీ చేస్తున్న మరో ముఠా పోలీసులకు చిక్కింది. మొత్తంగా రెండు ముఠాల్లోని 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు రూ.17.77 లక్షల విలువైన నకిలీ నోట్లు, స్కానర్లు, ప్రింటర్లు, కట్టర్లు, వైట్ పేపర్ బండిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి, మెహిదీపట్నం, అబిడ్స్ జగదీశ్ మార్కెట్లలో ఫేక్ కరెన్సీని సరఫరా చేస్తున్న ఆ ముఠాల వివరాలను మంగళవారం టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావుతో కలిసి హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.
రూ.30 వేలకు రూ.లక్ష నకిలీ నోట్లు
సంగారెడ్డి టౌన్ బసవేశ్వర్నగర్కు చెందిన ఇషాఖ్ బిన్ సలే (33), బండారి గౌతమ్ (28)లు యూట్యూబ్ వీడియోలు చూసి నకిలీ నోట్లను తయారు చేయడం నేర్చుకున్నారు. ఓ ఆన్లైన్ సైట్లో కలర్ ప్రింటర్లు, స్కానర్లు కొన్నారు. రూ.100, రూ.200 నకిలీ నోట్లను తయారు చేసి, ఊళ్లలోని వ్యాపారులను టార్గెట్ చేసుకున్నారు. ఏజెంట్ల ద్వారా రూ.30 వేలకు రూ.లక్ష విలువైన నకిలీ నోట్లను సరఫరా చేశారు. జహీరాబాద్, సదాశివపేట్ చుట్టుపక్కల ఉన్న ఊళ్లలో దొంగనోట్లను చలామణీ చేశారు. సంగారెడ్డికి చెందిన మహ్మద్ సోహైల్ అలీ (22), టోలీచౌకీకి చెందిన మహ్మద్ గౌసియుద్దీన్ (21), అక్బర్ ఖాన్ (26), సయీద్ కాశిఫ్ బహదూర్(19)తో పాటు మరో ముగ్గురు మైనర్లతో కలిసి జగదీశ్ మార్కెట్లోనూ ఫేక్ నోట్లను సప్లై చేశారు. అయితే, దొంగనోట్లు మారుస్తున్నారన్న సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు, మంగళవారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి కేంద్రంగా సాగుతున్న దందాకు చెక్పెట్టారు. ప్రధాన నిందితులైన ఇషాఖ్, బండారి గౌతమ్ను అరెస్ట్ చేసి రూ.9.27 లక్షల విలువైన ఫేక్ కరెన్సీతో పాటు ప్రింటింగ్ సామాన్లను స్వాధీనం చేసుకున్నారు.
డబుల్ కమీషన్
హైదరాబాద్లోని మెహిదీపట్నం కేంద్రంగా రూ.2000, రూ.500 నకిలీ నోట్లను సరఫరా చేస్తున్న మరో ముఠానూ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్లను ప్రింట్ చేస్తున్న బి.వి. శివసందీప్ (30), డబుల్ కమీషన్కు వాటిని సరఫరా చేస్తున్న అక్బర్ పాషా (30), మహ్మద్ మోయిన్(44), మహ్మద్ రజీయుద్దీన్ (30)ను అరెస్ట్ చేశారు. వాళ్ల నుంచి రూ.8.5 లక్షల విలువైన ఫేక్ కరెన్సీతో పాటు ఆరు సెల్ఫోన్లు, ప్రింటింగ్ సామాన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండు ముఠాలతో పాటు బంగ్లాదేశ్ నుంచి నకిలీ నోట్లను సరఫరా చేస్తున్నాడన్న సమాచారంతో పశ్చిమబెంగాల్ మాల్దాకు చెందిన అమీన్ ఉల్ రెహ్మాన్ అలియాస్ బబ్లూ (40)ను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఇప్పటికే 8 కేసులు నమోదయ్యాయి. పోయినేడాది ఫిబ్రవరి 15న రూ.4 లక్షల ఫేక్ కరెన్సీని చలామణీ చేస్తూ దొరికిపోయిన కేసులో నిందితుడిగా ఉన్న అతడు, తప్పించుకు తిరుగుతున్నాడు. మంగళవారం హైదరాబాద్ పాతబస్తీకి వచ్చాడన్న సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.