ఆస్పత్రిలో వీల్ చైర్ లేకపోవడంతో గాయపడిన తన కుమారుడిని ఏకంగా స్కూటర్ పై మూడో అంతస్థుకు తీసుకెళ్లాడు ఓ తండ్రి. ఈ విస్తుపోయే ఘటన రాజస్థాన్ లోని కోటాలో జరిగింది.
మనోజ్ జైన్ అనే న్యాయవాది కుమారుడి కాలికి గాయమైంది. దీంతో కోటాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే ఆర్థోపెడిక్ వార్డు థర్డ్ ఫ్లోర్ లో ఉంది. దీంతో కుమారుడిని తీసుకెళ్లేందుకు వీల్ చైర్ ఇవ్వాలని ఆసుపత్రి సిబ్బందిని కోరగా..లేవని చెప్పడంతో స్కూటీపై థర్డ్ ఫ్లోర్ కి వెళ్లాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన అక్కడి జనం అందరూ ఒక్కసారిగా షాక్ కి గురై నోరెళ్ల బెట్టారు. అనంతరం లిఫ్ట్ నుంచి నుంచి స్కూటర్ నడుపుతూ ఆర్థోపెడిక్ వార్డుకు కుమారుడిని తీసుకెళ్లాడు. డాక్టర్ కి చూపించిన అనంతరం తిరిగి వచ్చేందుకు మనోజ్ జైన్ ప్రయత్నించాడు.
కీ లాక్కున్న సెక్యూరిటీ..
అయితే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని స్కూటర్ కీ తీసుకున్నారు. దీనిపై మనోజ్ జైన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆస్పత్రిలో వీల్ చైర్లు లేకపోవడంతో సిబ్బంది అనుమతితో గాయపడిన కుమారుడిని స్కూటర్ పై మూడు అంతస్థుకు తీసుకెళ్లినట్లు చెప్పాడు. ఆసుపత్రిలో మౌలిక వసతులు లేకపోవడంపై మండిపడ్డాడు. మరోవైపు ఆసుపత్రిలోని అవుట్ పోస్ట్ వద్ద ఉన్న పోలీసులకు ఈ వాగ్వాదం గురించి తెలిసింది.
దీంతో వారు వెంటనే మూడో అంతస్తుకు చేరుకున్నారు. న్యాయవాది మనోజ్ జైన్ చేసిన పనిని పోలీసులు కూడా సమర్థించారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పి రాజీ కుదిర్చారు. వీల్ చైర్స్ ను అందుబాటులో ఉంచుతామని వైద్యాధికారులు హామీ ఇచ్చారు. కాగా ప్రస్తుతం ఈ విషయంకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.