 
                                    - మహబూబాబాద్ జిల్లాస్పత్రిలో దారుణం..
- కదలికలు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిన స్వీపర్
- మహబూబాబాద్ జిల్లా హాస్పిటల్లో దారుణం
మహబూబాబాద్, వెలుగు : ఓ వ్యక్తి బతికే ఉన్నప్పటికీ.. చనిపోయాడని భావించి మార్చురీలో పడేశారు. ఆ వ్యక్తిలో కదలికలను గుర్తించిన స్వీపర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన వెల్ది రాజు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసేవాడు.
మద్యానికి బానిసైన రాజు రోడ్ల వెంట తిరుగుతుండడంతో కుటుంబ సభ్యులు సైతం ఆయనను పట్టించుకోవడం మానేశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న అతడు మూడు రోజుల కింద మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చాడు. అతడిని పరీక్షించిన డాక్టర్లు ఆధార్ కార్డుతో పాటు, వెంట ఉండేందుకు కుటుంబ సభ్యులను తీసుకొని రావాలని సూచించారు. కుటుంబ సభ్యులెవరూ పట్టించుకోకపోవడంతో ఎటు పోవాలో తెలియని రాజు మూడు రోజులుగా హాస్పిటల్ ఆవరణలోని క్యాంటీన్ వద్ద పడుకుంటున్నాడు.
దుస్తులలోనే టాయిలెట్ పోసుకోవడంతో వాసన వస్తుందన్న ఉద్దేశంతో క్యాంటీన్ సిబ్బంది అతడిని బయట పడుకోబెట్టారు. ఈ క్రమంలో వర్షానికి తడిసిపోయిన అతడు మార్చురీ సమీపంలో పడిపోయాడు. గమనించిన హాస్పిటల్ సిబ్బంది.. చనిపోయి ఉంటాడని భావించి మార్చురీ ఆవరణలోని గద్దెపై పడేశారు. గురువారం ఉదయం స్వీపర్ మార్చురీని క్లీన్ చేస్తుండగా.. రాజు కదలడాన్ని గమనించి సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చింది. వారు వచ్చి విషయాన్ని డాక్టర్లకు చెప్పడంతో వెంటనే వార్డులోకి తరలించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు.
హస్పిటల్పై తప్పుడు ప్రచారం చేయొద్దు : శ్రీనివాసరావు, ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్
ప్రాణం ఉండగానే రాజును మార్చురీలో పడేశారనడం సరికాదని హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు చెప్పారు. అతడు హాస్పిటల్ ఆవరణలో తిరుగుతుండడం, మార్చురీ సమీపంలో వర్షంలో తడుస్తుండడంతో గమనించిన సిబ్బంది అతనిని రక్షించడం కోసమే మార్చురీ సమీపంలోని గద్దెపై పడుకోబెట్టారన్నారు. అతడు ప్రాణాలతోనే ఉన్నాడని గుర్తించి ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నామని చెప్పారు. కొందరు వ్యక్తులు కావాలనే ప్రభుత్వ హాస్పిటల్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

 
         
                     
                     
                    