World Cup 2023 final : 'ఫ్రీ పాలస్తీనా' టీ-షర్ట్‌తో మ్యాచ్‌లో వ్యక్తి హల్‌చల్

World Cup 2023 final : 'ఫ్రీ పాలస్తీనా' టీ-షర్ట్‌తో మ్యాచ్‌లో వ్యక్తి హల్‌చల్

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్స్‌లో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడికి నిరసనగా 'ఫ్రీ పాలస్తీనా' టీ-షర్ట్ ధరించిన ఓ వ్యక్తి మ్యాచ్ జరుగుతున్న సమయంలో పిచ్‌లోకి వచ్చి హల్ చల్ చేశాడు. అంతేకాదు, కోహ్లీని కౌగిలించుకునే ప్రయత్నం కూడా చేశాడు. ఎర్రటి షార్ట్‌ ధరించిన ఆ వ్యక్తి, ముందు భాగంలో 'పాలస్తీనాపై బాంబింగ్ ఆపండి', టీ షర్ట్ వెనుక 'ఫ్రీ పాలస్తీనా' అనే సందేశంతో తెల్లటి టీ షర్టు ధరించాడు. పాలస్తీనా రంగులలో ముఖానికి మాస్క్‌ను కూడా అతను ధరించాడు. దీంతో మ్యాచ్ కొద్దిసేపు ఆగిపోగా, ఆ తర్వాత అతన్ని భద్రతా సిబ్బంది పిచ్ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.

అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక, భూదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పాలస్తీనియన్లపై ముఖ్యంగా పౌరులు ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లో జరుగుతున్న మ్యాచ్ లో పిచ్‌పై దాడి చేసిన వ్యక్తి ఇంద్రధనస్సు జెండాను కూడా పట్టుకున్నాడు. దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది.. భద్రతా ఉల్లంఘనపై అతన్ని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.

ఆ తర్వాత ఆ వ్యక్తిని చంద్‌ఖేడా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ సమయంలో అతను వేరే టీ-షర్ట్ ధరించి కనిపించాడు, అతని ముఖానికి మాస్క్ కూడా లేదు. ఆ వ్యక్తి తనను తాను జాన్సన్ వేన్‌గా చెప్పుకోగా.. తాను ఆస్ట్రేలియా నుండి వచ్చానని, విరాట్ కోహ్లీని కలవడానికి వచ్చానని చెప్పాడు. పాలస్తీనాలో జరిగిన యుద్ధంపై నిరసనగా ఈ పని చేశానని.. తనను పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి విలేకరులతో చెప్పాడు.