న్యూఢిల్లీ: ఇన్ఫ్లేషన్ (ధరల పెరుగుదల) కారణంగా చాలా మంది ఇంటి బడ్జెట్ పెరిగినట్టు తాజా సర్వేలో తేలింది. ఫ్యూయల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలే ఈ పరిస్థితికి కారణమని సర్వేలో పాల్గొన్నవారిలో 92 % కుటుంబాలు వెల్లడించాయి. గడచిన మూడు నెలల్లో తమ సగటు నెలవారీ ఖర్చులు పెరిగాయని చెప్పారు. ఇంటి ఖర్చులు 10 % వరకు పెరిగాయని మెజారిటీ రెస్పాండెంట్లు అన్నారు. కమ్యూనిటీ ప్లాట్ఫారమ్ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. వచ్చే మూడు నెలల్లో నెలవారీ ఖర్చులు 10 % కంటే ఎక్కువ పెరుగుతాయని అనుకుంటున్నామని 55 % మంది రెస్పాండెంట్లు చెప్పారు. 10 % పెరుగతాయని 26 % మంది అన్నారు. ఈ సర్వే కోసం లోకల్ సర్కిల్ 12,000 కంటే ఎక్కువ ఇండ్ల నుంచి 23,500 మంది నుంచి అభిప్రాయాలను తీసుకుంది. 42% మంది రెస్పాండెంట్లు టైర్ 1 నగరాలకు చెందినవారు కాగా, 31% మంది టైర్ 2 నగరాల నుండి, మరో 27% మంది రెస్పాండెంట్లు టైర్ 3, 4 గ్రామీణ జిల్లాల నుంచి ఉన్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కారణంగా గడిచిన 3 నెలల్లో పెట్రోలు, డీజిల్, వంటనూనెలు, నిత్యావసర వస్తువులు, సేవల ధరలు పెరగడంతో ఇంటి బడ్జెట్పై భారం పడిందని లోకల్ సర్కిల్స్ తెలిపింది. చాలా వస్తువుల ధరలు అనేక సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరాయి.
భారీగా టోకు ధరలు...
ఈ వారం ప్రారంభంలో కేంద్రం విడుదల చేసిన లెక్కల ప్రకారం, టోకు ధరల ఇన్ఫ్లేషన్ తొమ్మిదేళ్లలో గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇదిఈ ఏడాది మార్చిలో 14.5% నుండి ఏప్రిల్లో 15.08శాతంకి పెరిగింది. ఆహారం వస్తువుల ధరల పెరుగుదల వల్లే ఇన్ఫ్లేషన్ ఇంత భారీగా ఉందని ప్రభుత్వం తెలిపింది. టోకు ధరల సూచిక (డబ్ల్యూపీఐ) ఇన్ఫ్లేషన్గడచిన 13 నెలలుగా రెండంకెల మేర రికార్డు అవుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్పై రూ.10 తగ్గిస్తే ఇంటి ఖర్చులు చాలా వరకు దిగొస్తాయని లోకల్ సర్కిల్ అభిప్రాయపడింది.