- మార్కెట్ల కు గుడ్న్యూస్!
- ఇమ్మిగ్రేషన్ పాలసీలు సల్లబడతాయ్
- 5 లక్షల మంది ఇండియన్లకు సిటిజన్షిప్
- స్కిల్డ్ వీసాలు పెరుగుతాయ
బిజినెస్ డెస్క్, వెలుగు: అగ్రరాజ్యం అమెరికాకు కొత్త ప్రెసిడెంట్గా డెమొక్రటిక్ లీడర్ జో బైడెన్ ఎన్నికవడం అన్ని వర్గాల నుంచి ఆనందం వ్యక్తమవుతోంది. ఇండియన్ కంపెనీలు కూడా బైడెన్ విజయాన్ని స్వాగతిస్తున్నాయి. ఇండో–అమెరికా సంబంధాలు మరింత ముందుకు వెళ్తాయని భావిస్తున్నాయి. అంతేకాక మన స్టాక్ మార్కెట్లకు కూడా బైడెన్ ఎంపిక గుడ్ న్యూస్గా ఉండనుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇన్ని రోజులు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, ప్రొటెక్షనిజం వంటివి మన మార్కెట్లను బాగా ఇబ్బంది పెట్టాయి. బైడెన్ గెలుపుతో ప్రొటెక్షనిజం అంత ఎక్కువగా ఉండదని ఇన్వెస్ట్మెంట్ గురు జిమ్ రోగర్స్ అన్నారు. ఇది ఇండియాకు మంచి విషయమని పేర్కొన్నారు. అమెరికన్లు మార్పు కోసం ఓటు వేశారని, ఇండియా, అమెరికా మధ్య సంబంధాలు బలపడతాయని, కోఆపరేషన్ పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రెసిడెంట్గా ఎంపికైన జో బైడెన్కు, వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన ఇండియన్ అమెరికన్ కమలా హారిస్కు కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ శుభాకాంక్షలు చెప్పారు. కరోనాకు ముందు ఇండియా, అమెరికా మధ్య ట్రేడ్ 150 బిలియన్ డాలర్లకు పెరిగింది. వచ్చే ఏళ్లలో కూడా ఈ ట్రేడ్ మరింత పెరుగుతుందని బెనర్జీ చెప్పారు. ఇండియా, అమెరికా మధ్య ట్రేడ్ను 500 బిలియన్ డాలర్లకు చేర్చాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఐటీ, ఎనర్జీ, గ్రీన్ ఎకానమీ, డిఫెన్స్, మాన్యుఫాక్చరింగ్, ఫార్మాస్యూటికల్స్, హెల్త్కేర్ వంటి రంగాల్లో ఇండియాకు, అమెరికాకు మధ్య రిలేషన్స్ ఉన్నాయి. మరోవైపు చైనాకు గ్లోబల్గా సంబంధాలు అంత బాగోలేవు. ఇండియాకు గ్లోబల్గా మంచి పేరుంది.
ఈ నేపథ్యంలో జో బైడెన్ కూడా ఇండియాకు సానుకూలంగా నిలవనున్నారని కేఆర్ చోక్సి ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ గ్రూప్ ఎండీ దేవెన్ చోక్సి చెప్పారు. బైడెన్కు నాన్ వైట్ కమ్యూనిటీ నుంచి ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. దీంతో ఇండియాను ఆయన ప్రిఫరబుల్ పార్టనర్గా ఎంచుకోనున్నారని చోక్సి పేర్కొన్నారు. బరాక్ ఒబామా అడ్మినిస్ట్రేషన్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో కూడా బైడెన్ ఇండియాతో స్ట్రాంగ్ రిలేషన్స్నే కోరుకున్నారని మార్కెట్ నిపుణులు చెప్పారు. లిబరల్ ఇమ్మిగ్రేషన్ పాలసీలకే బైడెన్ ఓటేస్తారని అన్నారు. ఈ విషయం పరంగా తీసుకుంటే ట్రంప్ పదవీ కాలంలో ఐటీ సెక్టార్ తీవ్ర ఇబ్బందులు పడింది. ట్రంప్ తెచ్చిన వీసా రిస్ట్రిక్షన్ పాలసీల నుంచి ఐటీ సెక్టార్ కాస్త విముక్తి చెందుతుందని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ప్రెసిడెంట్గా ఎంపికైన బైడెన్ హై స్కిల్డ్ వీసాలను పెంచాలని ప్లాన్ వేస్తున్నారు. దీనిలో హెచ్–1బీ కూడా ఉంది. ఎంప్లాయీ బేస్డ్ వీసాల(గ్రీన్ కార్డుల) విషయంలో దేశాలపై ఉన్న పరిమితిని ఎత్తివేయాలని కూడా చూస్తున్నారు. దీంతో వేల మంది ఇండియన్ ప్రొఫెషనన్లు లబ్ది పొందనున్నారని తెలుస్తోంది. అంతేకాక హెచ్–1బీ వీసాల భాగస్వామ్యుల వర్క్ పర్మిట్స్ను రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోనున్నారని సమాచారం. అమెరికాలో నివసిస్తోన్న ఐదు లక్షల మంది భారతీయులకు యూఎస్ సిటిజన్షిప్ ఇచ్చేందుకు కూడా బైడెన్–కమలా అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తోంది. ఇమిగ్రేషన్ రీఫామ్స్ తీసుకొచ్చేందుకు కాంగ్రెస్తో కలిసి బైడెన్ పనిచేస్తున్నారని, సుమారు కోటి మంది వరకు అమెరికాలో సిటిజన్షిప్ కోసం వేచిచూస్తున్నారని బైడెన్ పాలసీ డాక్యుమెంట్ చెప్పింది.