న్యూఢిల్లీ:ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకి ఇండియా నికర లాభం 2023 జూన్తో ముగిసిన మొదటి క్వార్టర్లో వార్షికంగా 2.5 రెట్లు పెరిగి రూ. 2,485 కోట్లకు చేరుకుంది. ఇది ఈటీనౌ పోల్ అంచనా రూ. 2,444 కోట్ల కంటే ఇది కొంచెం ఎక్కువగా ఉంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరానికి 22 శాతం పెరిగి రూ. 32,327 కోట్లకు చేరుకుంది. ఇది కూడా ఎనలిస్టుల అంచనా రూ. 31,778 కోట్ల కంటే ఎక్కువే. కంపెనీ ఈ క్వార్టర్లో 4,98,030 బండ్లను విక్రయించింది. ఇది గత ఏడాది కాలంతో పోలిస్తే 6.4శాతం ఎక్కువ. దేశీయ మార్కెట్లో అమ్మకాలు ఏడాదికి 9 శాతం పెరిగి 4,34,812 యూనిట్లకు చేరుకోగా, ఎగుమతులు 9 శాతం క్షీణించి 63,218 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ క్వార్టర్లో ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత కారణంగా 28,000 వెహికల్స్ ఉత్పత్తి ఆగిపోయిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పెండింగ్లో ఉన్న కస్టమర్ ఆర్డర్లు క్వార్టర్ చివరిలో దాదాపు 3,55,000 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ ఆర్డర్లను వేగంగా అందించడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. అమ్మకాలు బాగుండటం, ఖర్చుల తగ్గింపు ప్రయత్నాలు, ఎక్కువ నాన్- ఆపరేటింగ్ ఆదాయం వంటివి లాభాలు పెరగడానికి కారణాలని మారుతి సుజుకీ తెలిపింది. కంపెనీ ఆదాయాన్ని (ఇతర నిర్వహణా ఆదాయాన్ని మినహాయించి) రూ. 30,845 కోట్లుగా లెక్కించారు. ఈసారి ఎన్నడూ లేనన్ని క్వార్టర్లీ అమ్మకాలు సాధించింది. పన్ను చెల్లింపులు రూ.705 కోట్లు ఉన్నాయి. గత ఏడాది రూ.309 కోట్లు చెల్లించామని మారుతి తెలిపింది. ఎన్ఎస్ఈలో సోమవారం మారుతీ సుజుకీ షేర్లు 1.6 శాతం లాభంతో రూ.9,821 వద్ద ముగిశాయి.
సుజుకీ ప్లాంటును దక్కించుకోనున్న మారుతి
తన పేరెంట్ కంపెనీ సుజుకీకి గుజరాత్లో ఉన్న ప్లాంటులో పూర్తి వాటాను కొనేందుకు తమ బోర్డు అంగీకరించిందని మారుతి సుజుకీ ప్రకటించింది. ప్రస్తుతం సుజుకీ మోటార్ కార్పొరేషన్కు (ఎస్ఎంసీకి) సుజుకీ మోటార్ గుజరాత్ (ఎస్ఎంజీ)లో 100 శాతం వాటా ఉంది. ఎస్ఎంజీతో ఉన్న కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ ఒప్పందాన్ని ఆపేయాలని సోమవారం జరిగిన మారుతి బోర్డు సమావేశంలో నిర్ణయించారు. ఎస్ఎంసీ నుంచి ఎస్ఎంజీలో పూర్తి వాటా కొనాలని కూడా నిర్ణయించారు. ఇందుకు లీగల్, రెగ్యులేటరీ, మైనారిటీ షేర్హోల్డర్ల అనుమతులు అవసరం. ఈ డీల్ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతుందని మారుతి భావిస్తోంది. ఎస్ఎంసీకి ఏ రూపంలో చెల్లించాలనే విషయమై వచ్చే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. భారతీయ కార్ల మార్కెట్ ఎగుమతి సామర్థ్యం భారీగా పెరుగుతున్నందున.. మారుతి సుజుకి తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030–-31 సంవత్సరానికి 40 లక్షల కార్లకు పెంచుకోవాలని చూస్తోంది. ఇది ప్రస్తుత స్థాయి కంటే రెండింతలు ఎక్కువ. కార్బన్ న్యూట్రాలిటీ టార్గెట్లను చేరుకోవడానికి ఈవీలు, హైబ్రిడ్లు, సీఎన్జీ, ఇథనాల్ పవర్ట్రెయిన్ టెక్నాలజీలను డెవెలప్ చేయాలి. ఇక ముందులాగే ఇప్పుడు కూడా ఎస్ఎంజీ నుంచే సప్లైలు ఉంటాయి కాబట్టి ఆక్చువల్ ప్రొడక్షన్, లాజిస్టిక్స్, అమ్మకాలు, వాటి ధరల్లో ఎలాంటి మార్పులూ ఉండబోవని మారుతి సుజుకీ తెలిపింది.