గరికపాటి నుంచి క్షమాపణ కోరలేదు

గరికపాటి నుంచి క్షమాపణ కోరలేదు

గురువారం హైదరాబాద్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో జరిగిన పరిణామాల పట్ల ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో చిరంజీవి సోదరుడు నాగబాబు   ట్విట్టర్ వేదికగా స్పందించారు. గరికపాటి నరసింహారావు ఏదో మూడ్ లో అలా అని ఉంటారని భావిస్తున్నామని తెలిపారు. అయితే గరికపాటి లాంటి పండితుడు అలా అనకుండా ఉండాల్సిందన్న విషయాన్ని ఆయన అర్థం చేసుకోవాలని మాత్రమే తాము భావించామని అన్నారు. అంతేతప్ప.. ఆయనతో క్షమాపణలు చెప్పించుకోవాలని తాము కోరుకోలేదని నాగబాబు స్పష్టం చేశారు. ఏదేమైనా మెగా అభిమానులు గరికపాటిని అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆయన గురించి ఎవరూ తప్పుగా మాట్లాడవద్దని నాగబాబు విజ్ఞప్తి చేశారు.

ఇక గురువారం నాగబాబు ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారి తీశాయి. "ఏ పాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే.." అంటూ ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. నాగబాబు ట్వీట్లో ఎవరి పేరు ప్రస్తావించకపోయినా.. గరికపాటిని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గరికపాటిని తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలోనే గరికపాటి నరసింహారావు మెగస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పారంటూ వార్తలు వచ్చాయి.