- మరికొంత మంది లీడర్లు కూడా
- పోయిన ఏడాది ఆగస్టు నుంచి నిర్బంధంలోనే
జమ్మూకాశ్మీర్: పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ చీఫ్, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ గృహనిర్బంధ గడువును మరో మూడు నెలలు పెంచారు. దీంతో ఆమె మరో మూడు నెలలు డిటెన్షన్లోనే ఉండాలి. పోయిన ఏడాది ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద గృహనిర్బంధంలో ఉంచారు. ఇప్పుడు ఆ గడువును మరో మూడు నెలల పాటు పొడిగించగా.. తిరిగి ఈ ఏడాది ఆగస్టులో దానిపై రివ్యూ చేయాల్సి ఉంటుంది. అంటే ముఫ్తీ దాదాపు సంవత్సరం పాటు నిర్బంధంలో ఉన్నట్లు. కాగా.. ముఫ్తీతో పాటు నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ అలీ మహ్మద్, పీడీపీ లీడర్ సర్తాజ్ మదీనా, మరికొంత మంది లీడర్లపై కూడా పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద గృహనిర్బంధ గడువును పెంచినట్లు అధికారులు చెప్పారు. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా ప్రభుత్వం చాలా మంది లీడర్లను గృహనిర్బంధంలో ఉంచింది. వారిలో కొంత మందిని రీలీజ్ చేసి.. మరి కొంత మందిపై పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ను ప్రయోగించారు. ఆ తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, ఆయన కొడుకు ఒమర్ అబ్దుల్లాను రిలీజ్ చేసిన అధికారులు ముఫ్తీపై మాత్రం నిర్బంధాన్నిఎత్తేయలేదు.