
మహబూబ్నగర్, వెలుగు: భూ భారతి చట్టం ఆప్పీళ్లకు అవకాశం ఉందని మంత్రి దామోదర తెలిపారు. కానీ, కొందరు రెవెన్యూ ఆఫీసర్లు రైతులను తమ చుట్టూ తిప్పుకోవడం సరి కాదన్నారు. వచ్చిన అప్లికేషన్లను త్వరగా పరిష్కరించాలని ఆయన సూచించారు. మహబూబ్నగర్ కలెక్టరేట్లో శుక్రవారం పాలమూరు, నారాయణపేట జిల్లాలకు సంబంధించి పంటల సాగు, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం, భూ భారతి, వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. నిర్మాణాల విషయంలో కొంత విస్తీర్ణం పెరిగినా వాటిని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. మంత్రి దామోదర మాట్లాడుతూ రూల్స్ ప్రకారమే ఇండ్లు నిర్మించుకోవాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్, నిర్మాణాలపై సమీక్షించారు.
వర్షాకాలం ప్రారంభం కావడంతో గ్రామాల్లో రోగాలు ప్రబలే చాన్స్ ఉందని పలువురు ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో ఫాగింగ్ మెషీన్లు లేవని, మరికొన్ని జీపీల్లో మెషీన్లు పని చేయడం లేదన్నారు. పరిగి నియోజకవర్గంలోని పలు మండలాల్లో బీపీ, షుగర్ ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో లేవన్నారు. జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయని సంబంధిత ఆఫీసర్లను మంత్రి ప్రశ్నించారు. వాటిని ఎంటర్టైన్ చేయొద్దని మంత్రి సూచించారు.