కాంగ్రెస్ నాయకులు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు : మంత్రి ఎర్రబెల్లి

కాంగ్రెస్ నాయకులు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు : మంత్రి ఎర్రబెల్లి

కాంగ్రెస్ నాయకులు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో చూపెట్టాలంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కొందరు నాయకులు తుపాకిరాముడు మాదిరిగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 2 వేల పెన్షన్ ఇవ్వలేనివాళ్లు తెలంగాణలో ఇస్తారట అని వ్యంగ్యంగా మాట్లాడారు. హన్మకొండ జిల్లా భీమదేవరపెల్లి మండలం ముల్కనూర్ లోని ప్రజా గ్రంథాలయంలో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. 

తెలంగాణ మినహా దేశంలో మరెక్కడా రైతుబంధు, 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎన్ని నిధులైనా ఇస్తాం.. హుస్నాబాద్ లో సతీష్ బాబును మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నచ్చిన నాయకులు ఇద్దరే ఉన్నారని, వారిలో ఒకరు ఎన్టీఆర్.. మరొకరు కేసీఆర్ అని చెప్పారు. విగ్రహాలు చూసినప్పుడల్లా మహనీయుల పోరాటాలు గుర్తుకొస్తాయన్నారు.