
మల్హర్/ మహాదేవపూర్/ భీమదేవరపల్లి, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారం కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఇటీవల ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి తల్లి లక్ష్మీబాయి మృతిచెందడంతో జయశంకర్భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లెంకుంటలో నిర్వహించిన దశదిన కర్మ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ప్రకాశ్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు లక్ష్మీబాయి ఫొటోకు నివాళులర్పించారు.
అనంతరం వల్లెంకుంట ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలో గ్రామస్తులు మంత్రిని కలిసి సమస్యలు తెలిపారు. స్పందించిన మంత్రి అంబేద్కర్ భవన్ నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరు చేస్తామని, అంబేద్కర్ విగ్రహానికి రూ.50 వేల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మహాదేవపూర్ మండలం బొమ్మాపూర్ లో వేమూనూరి రవీందర్ రెడ్డి పద్మ కుమార్తె అశ్విని వివాహ వేడుకలకు మంత్రి వివేక్ హాజరై పెళ్లికుమార్తెను ఆశీర్వదించారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్లో ఆయన గన్మెన్ ముష్కే రవి, ఏఆర్సీఐ రజనీకాంత్ తల్లి లచ్చమ్మ సంవత్సరికానికి హాజరై వారిని పరామర్శించారు. లచ్చమ్మ ఫొటోకు నివాళులర్పించారు. మండలానికి వచ్చిన మంత్రిని కాంగ్రెస్ భీమదేవరపల్లి మండల నాయకులు ఘనంగా సన్మానించారు.